అసెంబ్లీలో కేటీఆర్‌, ఈటల మధ్య ఆసక్తికర సన్నివేశం..

3 Feb, 2023 15:27 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణ బడ్జెట్‌ సమావేశాలు శుక్రవారం ప్రారంభమయ్యాయి. గవర్నర్‌ తమిళిసై సౌందరరాజన్‌, మండలి చైర్మన్‌ గుత్తా సుఖేందర్‌రెడ్డి, శాసనసభ స్పీకర్‌ పోచారం సమక్షంలో జనగణమన ఆలాపనతో సమావేశాలు లాంఛనంగా మొదలయ్యాయి.

ఈ క్రమంలో గవర్నర్ ప్రసంగానికి ముందు శాసనసభలో ఆసక్తికరమైన సన్నివేశం చోటు చేసుకుంది. ఎమ్మెల్యేల దగ్గరకు వెళ్లిన మంత్రి కెటిఆర్ అందరినీ పలకరించారు . బిజెపి ఎమ్మెల్యేల వద్ద దాదాపు 10 నిమిషాలు ఉన్నారు కెటిఆర్. ఎక్కువ సేపు ఈటెల రాజేందర్ దగ్గరే కనిపించారు కెటిఆర్.

బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్‌తో మంత్రి కేటీఆర్ ప్రత్యేకంగా మాట్లాడారు. హుజురాబాద్‌లో జరిగిన అధికారిక కార్యక్రమంలో ఎందుకు పాల్గొనలేదని ఈటలను కేటీఆర్‌ అడగ్గా, పిలిస్తే కదా హాజరైయ్యేదంటూ ఈటల సమాధానం ఇచారు.  ప్రభుత్వ విధానాలు ప్రజల్లోకి వెళ్లే ప్రాక్టీస్ సరిగాలేదంటూ కేటీఆర్‌కు ఈటల హితవు పలికారు.

ఈటల, కేటీఆర్ సంభాషణ మధ్యలో సీఎల్పీ నేత భట్టి విక్రమార్క ఎంట్రీ ఇచ్చారు. తనను సైతం అధికారిక కార్యక్రమాలకు పిలువటంలేదంటూ భట్టి ప్రస్తావించారు. కనీసం కలెక్టరేట్ అయినా ఆహ్వానించాలన్న ఈటల వ్యాఖ్యలకు మంత్రి కేటీఆర్‌ నవ్వి ఊరుకున్నారు. దీంతో గవర్నర్ సభలోకి వస్తున్నారంటూ ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య.. కేటీఆర్‌ను అలెర్ట్ చేశారు. దీంతో తన ట్రెజరీ బెంచీల వైపు కేటీఆర్‌ వెళ్ళిపోయారు. కేటీఆర్ కంటే ముందు డిప్యూటీ స్పీకర్ పద్మారావు గౌడ్ ఈటల వద్ద కొచ్చి ప్రత్యేకంగా మాట్లాడారు.
చదవండి: మా ప్రభుత్వం ఎన్నో సవాళ్లను అధిగమించింది: గవర్నర్‌ తమిళిసై

మరిన్ని వార్తలు