ఎయిర్‌పోర్టులో కొత్త టెర్మినల్‌ ప్రారంభం 

29 Nov, 2022 02:12 IST|Sakshi

శంషాబాద్‌: శంషాబాద్‌ అంతర్జాతీయ విమానాశ్రయంలో నూతనంగా ఏర్పాటు చేసిన అంతర్జాతీయ డిపార్చర్‌ కేంద్రం కార్యకలాపాలు సోమవారం ప్రారంభమయ్యాయి. ఎయిర్‌పోర్టు విస్తరణలో భాగంగా నాలుగేళ్లుగా అంతర్జాతీయ డిపార్చర్‌ కేంద్రాన్ని వీఐపీ మార్గంలో ఏర్పాటు చేసిన తాత్కాలిక టెర్మినల్‌ భవనంలో కొనసాగించారు. గతంలో ఉన్న డిపార్చర్‌ కేంద్రానికి అనుసంధానంగా నిర్మించిన కొత్త భవనం ఇటీవల పూర్తయింది.

దీంతో ప్రధాన టెర్మినల్‌లోనే కొత్త అంతర్జాతీయ డిపార్చర్‌ కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. సీఈవో ప్రదీప్‌ ఫణీకర్‌ పూజా కార్యక్రమాలు నిర్వహించి లాంఛనంగా ప్రారంభించారు. సోమవారం సాయంత్రం సౌదీ ఎయిర్‌లైన్స్‌ విమానం తొలిసారిగా కొత్త టెర్మినల్‌ కేంద్రంగా బయల్దేరింది. ప్రయాణికులకు సౌకర్యాల కల్పనలో జీఎంఆర్‌ అంతర్జాతీయ విమానాశ్రయం పురోగమిస్తోందని సీఈవో ప్రదీప్‌ ఫణీకర్‌ పేర్కొన్నారు.   

మరిన్ని వార్తలు