‘టి ఫైబర్‌’తో రైతు వేదికలకు ఇంటర్నెట్‌.. 

9 Apr, 2021 01:58 IST|Sakshi

పట్టణ ప్రాంతాలకు టి ఫైబర్‌ విస్తరణ

ఆగస్టు నాటికి అన్ని పంచాయతీలకు..

టి ఫైబర్‌ బోర్డు సమావేశంలో కేటీఆర్‌

సాక్షి, హైదరాబాద్‌: టి ఫైబర్‌పై ఐటీ మంత్రి కేటీఆర్‌ పలు కీలక నిర్ణ యాలు తీసుకున్నారు. రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన ‘టి ఫైబర్‌’ప్రాజెక్టు ద్వారా రైతు వేదికలను ఇంటర్నెట్‌తో అనుసంధానించి ప్రతి రైతుకూ మేలు జరిగేలా చూడాలని రాష్ట్ర ఐటీ, పరిశ్రమలశాఖ మంత్రి కేటీఆర్‌ అధికారులకు సూచించారు. సీఎం కేసీఆర్‌ సూచన మేరకు ఇప్పటికే ప్రయోగాత్మకంగా రాష్ట్రంలోని ఐదు రైతు వేదికలకు ఇంటర్నెట్‌ కనెక్షన్‌ ఇచ్చినట్లు చెప్పారు. గురువారం హైదరాబాద్‌లో జరిగిన తెలంగాణ ఫైబర్‌ గ్రిడ్‌ కార్పొరేషన్‌ (టి ఫైబర్‌) బోర్డు సమావేశంలో మంత్రి కేటీఆర్‌ పాల్గొని పలు నిర్ణయాలు తీసుకున్నారు. ఫైబర్‌ గ్రిడ్‌ ప్రాజెక్టు పరిధిని రాష్ట్రంలోని అన్ని మున్సిపాలిటీలకు విస్తరించాలని, ఇందులో భాగంగా గ్రేటర్‌ హైదరాబాద్‌ పరిధిలోనూ సర్వే చేసి నివేదిక ఇవ్వాలని ఆదేశించారు.

ఈ ఏడాది ఆగస్టు నాటికి అన్ని గ్రామపంచాయతీలను ఫైబర్‌ గ్రిడ్‌ ప్రాజెక్టు ద్వారా అనుసంధానించాలని సూచించారు. ఫైబర్‌గ్రిడ్‌ ప్రాజెక్టు పనుల పురోగతి మంత్రి ఆరా తీశారు. రాష్ట్రంలోని ప్రతి ఇంటికీ ఇంటర్నెట్‌ కనెక్షన్‌ ఇవ్వాలనే దీర్ఘకాలిక లక్ష్యంతో పనిచేస్తున్నామని పేర్కొన్నారు. రాష్ట్రంలోని 30 వేల ప్రభుత్వ కార్యాలయాలకు ఈ ఏడాది జూన్‌ నుంచి ప్రాధాన్యతాక్రమంలో కనెక్షన్లు ఇవ్వాలన్నారు. సమావేశంలో ఐటీ పరిశ్రమల శాఖ ముఖ్య కార్యదర్శి జయేశ్‌ రంజన్, ఆర్థికశాఖ ప్రత్యేక కార్యదర్శి రోనాల్డ్‌ రాస్, మిషన్‌ భగీరథ ఇంజనీర్‌ ఇన్‌ చీఫ్‌ కృపాకర్‌రెడ్డి, టీ ఫైబర్‌ ఎండీ సుజయ్‌ కారంపూరి పాల్గొన్నారు.  

చదవండి: 2 నెలల్లోనే తారస్థాయికి 

>
మరిన్ని వార్తలు