పాక్‌ యువతి చొరబాటు.. అది ‘హద్దు’లెరుగని ప్రేమే

29 Aug, 2022 02:49 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: నేపాల్‌ మీదుగా ఇటీవల సరిహద్దు దాటి దేశంలోకి ప్రవేశించిన ఓ పాక్‌ యువతి వ్యవహారంలో ఎటువంటి కుట్ర కోణం లేదని దర్యాప్తు సంస్థలు తేల్చాయి. సౌదీ అరేబియాలో పనిచేస్తున్న హైదరాబాద్‌ యువకుడు అహ్మద్‌తో సోషల్‌ మీడియా ద్వారా అయిన పరిచయంతో ప్రేమలో పడిన పాక్‌ యువతి ఖాదియా నూర్‌... అతను వేసిన పథకం ప్రకారమే మహ్మద్‌ (అహ్మద్‌ సోదరుడు), జీవన్‌ (నేపాల్‌ జాతీయుడు)లతో కలసి అక్రమంగా సరిహద్దు దాటి బిహార్‌లో సశస్త్ర సీమా బల్‌ (ఎస్‌ఎస్‌బీ) సేనలకు చిక్కిందని నిఘా, పోలీసు విభాగాలు గుర్తించాయి.

దీన్ని ప్రేమ వ్యవహారంగానే అభివర్ణించాయి. తొలుత దీని వెనుక భారీ కుట్ర ఉండి ఉండొచ్చని భావించిన ఎస్‌ఎస్‌బీ... నిందితులను బిహార్‌లోని సీతామర్హి జిల్లా పోలీసులకు అప్పగించింది. దీనిపై కేసు నమోదు చేసుకున్న అధికారులు, నిఘా వర్గాలు వారిని వివిధ కోణాల్లో విచారించాయి. హైదరాబాద్‌లోని బహదూర్‌పురతోపాటు ఇతర ప్రాంతాల్లోనూ ఆరా తీశాయి. అలాగే రాష్ట్ర నిఘా వర్గాలతోపాటు ప్రత్యేక పోలీసు బృందం బిహార్‌ వెళ్లి వారిని విచారించి ఇదే విషయాన్ని తేల్చింది. అయితే నూర్‌ అక్రమంగా సరిహద్దు దాటడానికి ప్రేరేపించి అందుకోసం ఏర్పాట్లు చేసిన అహ్మద్‌తోపాటు జీవన్‌లను ఈ కేసులో నిందితులుగా చేర్చాలని సీతామర్హి పోలీసులు భావిస్తున్నారు.   
చదవండి: జనవరికి సిద్ధం కానున్న కొత్త సచివాలయం

>
మరిన్ని వార్తలు