రెండోరోజూ ‘బాలవికాస’పై ఐటీ దాడులు

17 Mar, 2023 02:10 IST|Sakshi

కాజీపేట, హనుమకొండలోని కార్యాలయాల్లో తనిఖీలు 

సాక్షి ప్రతినిధి, వరంగల్‌: బాలవికాస స్వచ్ఛంద సంస్థ, దాని అనుబంధ సంస్థలపై వరంగల్‌వ్యాప్తంగా రెండు రోజులుగా కొనసాగుతున్న ఐటీ తనిఖీలు కలకలం రేపుతున్నాయి. సుమారు 15–20 వాహనాల్లో బుధవారం తెల్లవారుజామున హనుమకొండకు చేరుకున్న ఐటీ అధికారులు.. సీఆర్పిఎఫ్‌ భద్రత మధ్య తనిఖీలు మొదలుపెట్టారు. కాజీపేట ఫాతిమానగర్, హనుమకొండ సిద్ధార్థనగర్‌లలో ఉన్న బాలవికాస కార్యాలయాలు, నిర్వాహకుల ఇళ్లలో గురువారం రాత్రి వరకు 15 బృందాలుగా ఏర్పడిన అధికారులు సోదాలు నిర్వహించారు.

తొలిరోజు తనిఖీల్లో కంప్యూటర్లు, ల్యాప్‌టాప్‌లు, హార్డ్‌డిస్‌్కలతోపాటు కీలక ఉద్యోగులు, వ లంటీర్లకు చెందిన సె ల్‌ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. సుమా రు నాలుగైదేళ్లకు సంబంధించిన బాలవికాస ఆదాయ వ్యయాల పత్రాలు, వార్షిక నివేదికలపై ఆరా తీసినట్లు తెలిసింది. కాగా, బాలవికాస సంస్థపై ఐటీ దాడులను జిల్లాకు చెందిన మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు, ప్రభుత్వ చీఫ్‌ విప్‌ దాస్యం వినయభాస్కర్, ఎమ్మెల్యే ఆరూరి రమేశ్, కుడా చైర్మన్‌ సుందర్‌రాజు ఖండించారు. 

9 రాష్ట్రాలు, 7 వేల గ్రామాలకు సేవలు... 
భారత్‌లో సమాజాభివృద్ధి సేవల కోసం ఫ్రెంచ్‌–కెనడా జాతీయుడైన ఆండ్రే గింగ్రాస్, ఆయన సతీమణి బాలథెరిసా గింగ్రాస్‌ 1977లో కెనడాలో సోపర్‌ సంస్థను ప్రారంభించారు. సేవా కార్యకలాపాలను మరింత సమర్థంగా చేపట్టేందుకు వీలుగా సోపర్‌కు అనుబంధంగా కాజీపేటలోని ఫాతిమానగర్‌లో 1991లో బాలవికాస సంస్థను ప్రారంభించారు. ప్రస్తుతం బాలవికాసకు అనుబంధంగా 9 సంస్థలు పనిచేస్తున్నాయి.

తెలంగాణ, ఏపీతోపాటు కర్ణాటక, మహారాష్ట్ర, ఒడిశా, ఛత్తీస్‌గఢ్, జార్ఖండ్, తమిళనాడు, మధ్యప్రదేశ్‌లలోని 7 వేల గ్రామాలు, పలు స్వచ్ఛంద సంస్థలతో కలసి బాలవికాస సంస్థ తన సేవలు అందిస్తోంది. బాలవికాసలో సుమారు 300 మంది సిబ్బంది ఉండగా, క్షేత్రస్థాయిలో మరో 500 మంది పనిచేస్తున్నారు. గ్రామాల్లో నాణ్యమైన విద్య, సురక్షిత తాగునీరు, పరిశుభ్రత, పారిశుద్ధ్యం, నీటి సంరక్షణ, సుస్థిర వ్యవసాయం, మహిళా సాధికారత, ఆదర్శగ్రామాల ఏర్పాటు అంశాలు ప్రధాన లక్ష్యాలుగా 30 వేల మంది వలంటీర్లు బాలవికాస ద్వారా పనిచేస్తున్నారు.

ఇప్పటివరకు 60 లక్షల మంది పేదలకు మేలు కలిగేలా కార్యక్రమాలు నిర్వహించారు. 2014లో ఘట్‌కేసర్‌ వద్ద సెంటర్‌ ఫర్‌ సోషల్‌ రెస్పాన్స్‌ బిజినెస్‌ సెంటర్‌ను ప్రారంభించారు. సామాజిక వ్యవస్థాపకత, బాధ్యతాయుతమైన వ్యాపారాన్ని ప్రోత్సహించే శ్రేష్టత కేంద్రాలుగా 30 వినూత్న సోషల్‌ స్టార్టప్‌లను బాలవికాస ఏర్పాటు చేసింది. 125 మంది గ్రామీణ పారిశ్రామికవేత్తలకు మార్గనిర్దేశం చేసింది.  

మరిన్ని వార్తలు