సాక్షి, హైదరాబాద్: ‘యాంబిషన్ ఇండియా 2021’సదస్సులో పాల్గొనేందుకు ఫ్రెంచ్ రాజధాని పారిస్కు వెళ్లిన రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీ రామారావుతో ఓ విశిష్ట అతిథి భేటీ అయ్యారు. మూడు దశాబ్దాలకు పైగా తెలుగు భాష మీద పరిశోధన చేస్తూ, తెలుగులో అనర్గళంగా మాట్లాడే ప్రొఫెసర్ డేనియల్ నెగర్స్ మంత్రి కేటీఆర్ను కలిశారు. ఫ్రెంచ్ యూనివర్సిటీ ‘నేషనల్ ఇన్స్టిట్యూట్ ఫర్ ఓరియంటల్ లాంగ్వేజెస్ అండ్ సివిలైజేషన్స్’లో దక్షిణ ఆసియా, హిమాలయన్ స్టడీస్ విభాగంలో డేనియల్ నెగర్స్ కొన్నేళ్లుగా తెలుగు భాషపై పరిశోధన చేస్తున్నారు. వేల మైళ్ల దూరాన ఉంటూ తెలుగు భాషపై మమకారం చూపించడం స్ఫూర్తిదాయకమని కేటీఆర్ ఈ భేటీ సందర్భంగా వ్యాఖ్యానించారు.