తెలంగాణ ప్రజలకు క్షమాపణలు చెప్పిన హైపర్‌ ఆది

15 Jun, 2021 22:28 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: బతుకమ్మ, గౌరమ్మపై అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు జబర్దస్త్‌ నటుడు హైపర్‌ ఆది క్షమాపణలు చెప్పాడు. ఆంధ్ర, తెలంగాణ అనే భేదాభిప్రాయాలు తమ షోలో ఎప్పుడు ఉండవు... అందరం కలిసికట్టుగా పని చేసుకుంటూ ఉంటామని వివరణ ఇచ్చారు. ‘శ్రీదేవి డ్రామా కంపెనీ’ షోలో చేసిన స్కిట్‌పై తెలంగాణ జాగృతి విద్యార్థి విభాగం ప్రతినిధులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా హైదరాబాద్‌లోని ఎల్బీనగర్‌లో కేసు దాఖలు చేసిన విషయం తెలిసిందే. మంగళవారం ఉదయం దీనిపై ఫోన్‌కాల్‌లో ఆ ప్రతినిధులకు వివరణ ఇచ్చారు.

అయితే బేషరతుగా క్షమాపణలు చెప్పేదాక తాము వదిలిపెట్టమని.. కావాల్సి వస్తే న్యాయపరంగా వెళ్తామని హెచ్చరించారు. ఈ నేపథ్యంలోనే హైపర్‌ ఆది క్షమాపణలు చెబుతూ రాత్రి వీడియో విడుదల చేశారు. ఆ షోలో చేసిన స్కిట్‌పై కొన్ని ఆరోపణలు వచ్చాయి.. అవి తాము కావాలని చేసినవి కావు అని హైపర్‌ ఆది తెలిపారు. అన్ని ప్రాంతాల వారి ప్రేమ, అభిమానంతోనే తాము వారికి వినోదం పంచుతున్నట్లు చెప్పారు. ఇటీవల షోలో జరిగిన దానికి అందరి తరఫున క్షమాపణ కోరుతున్నట్లు ప్రకటించాడు.

చదవండి: హైపర్‌ ఆదిపై పోలీసులకు ఫిర్యాదు
చదవండి: నేను తెలంగాణ సంస్కృతిని కించపరచలేదు: హైపర్‌ ఆది


మరిన్ని వార్తలు