లాక్‌డౌన్‌: విద్యుత్‌ సిబ్బందికి ఇబ్బందులు.. మంత్రి ఫైర్‌

22 May, 2021 15:40 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: లాక్‌డౌన్‌ పేరిట పోలీసులు విద్యుత్‌ ఉద్యోగులను ఇబ్బందులకు గురి చేస్తున్నారు. కరోనా మహమ్మారి కారణంగా రాష్ట్రంలో మే 12 నుంచి లాక్‌డౌన్‌ అమలవుతున్న సంగతి తెలిసిందే. అయితే లాక్‌డౌన్‌ నుంచి అత్యవసర సేవలకు ప్రభుత్వం మినహాయింపు ఇచ్చింది. వాటిలో విద్యుత్‌ శాఖ కూడా ఉంది. ఈ నేపథ్యంలో నల్గొండలో లాక్‌డౌన్‌లో భాగంగా పోలీసులు విద్యుత్‌ సిబ్బందిని అడ్డుకుంటున్నారు. ఉద్యోగులు తమ ఐడీ కార్డులు చూపిస్తున్నా పోలీసులు వినిపించుకోవడమే గాక అనుచితంగా ప్రవర్తిస్తున్నారు.  

దీంతో శనివారం విద్యుత్‌ ఉద్యోగులు ఈ విషయాన్ని మంత్రి జగదీష్‌ రెడ్డి దృష్టికి తీసుకెళ్లారు. కాగా నల్గొండ ఘటనపై జిల్లా ఎస్పీతో మాట్లాడిన మంత్రి అనంతరం డీజీపీతోనూ ఈ అంశంపై చర్చించారు.  విద్యుత్‌శాఖ అత్యవసర సర్వీసు కిందకు వస్తుందన్నారు. విద్యుత్ ఉద్యోగులను ఇబ్బంది పెట్టకుండా చూడాలన్నారు. విద్యుత్ సిబ్బంది పట్ల అనుచితంగా ప్రవర్తించిన పోలీసులపై చర్యలు తీసుకోవాలని మంత్రి జగదీష్‌ రెడ్డి కోరారు. 
చదవండి: లాక్‌డౌన్‌: చికెన్‌ వ్యాపారి కారుకు ప్రెస్‌ స్టిక్కర్‌.. చివరికి!

మరిన్ని వార్తలు