గల్ఫ్‌లో జగిత్యాల జిల్లా వాసికి ఊరట

3 Apr, 2021 14:04 IST|Sakshi
పిట్టల కొండగట్టు కుటుంబ సభ్యులు

పాస్‌పోర్టు లేక గల్ఫ్‌లో చిక్కుకున్న కొండగట్టు

గల్ఫ్‌ సంక్షేమ సంఘాల ప్రతినిధుల చొరవతో స్వదేశానికి.. 

కథలాపూర్‌ (వేములవాడ): చేయని తప్పునకు జైలు పాలై.. పాస్‌పోర్టు లేక దుబాయ్‌లో చిక్కుకున్న జగిత్యాల జిల్లావాసికి ఊరట లభించింది. గల్ఫ్‌ సంక్షేమ సంఘాల చొరవతో అతను స్వగ్రామానికి వచ్చేందుకు మార్గం సుగమమైంది. కథలాపూర్‌ మండలం గంభీర్‌పూర్‌కు చెందిన పిట్టల కొండగట్టు రెండేళ్ల క్రితం దుబాయ్‌ వెళ్లాడు. గతేడాది మార్చిలో కొండగట్టు పేరిట రిజిస్టర్‌ అయిన సిమ్‌కార్డు పాకిస్తాన్‌ దేశానికి చెందిన ఓ వ్యక్తి ఉపయోగించాడు. 

అతను చేసిన తప్పులకు కొండగట్టును అక్కడి పోలీసులు అరెస్టు చేసి జైలుకు పంపించారు. 8 నెలలు జైలు జీవితం గడిపిన కొండగట్టు.. ఇటీవల విడుదలయ్యాడు. అయితే.. కొండగట్టు వద్ద పాస్‌పోర్టు లేకపోవడంతో స్వదేశానికి రాలేకపోయాడు. ఈ విషయమై గత నెల 21న ‘స్వదేశానికి రప్పించండి’శీర్షికన సాక్షి మెయిన్‌లో ప్రచురితమైన కథనానికి గల్ఫ్‌ సంక్షేమ సంఘాల ప్రతినిధులు స్పందించారు. కొండగట్టు స్వదేశానికి వచ్చేందుకు కోర్టు అనుమతి పత్రం, ఎన్‌ఓసీ దుబాయ్‌లోని రాయబార కార్యాలయానికి అందేలా చర్యలు తీసుకున్నారు. దీంతో అతను స్వగ్రామానికి వచ్చేందుకు మార్గం సుగమమైంది. 

ఇక్కడ చదవండి:
శ్రీనివాస్‌ను జైలు నుంచి విడిపించరూ..! 

ఆరేళ్లుగా కుమార్తె అస్థికలు భద్రపరిచి..

మరిన్ని వార్తలు