Etela Rajender:హైకోర్టును ఆశ్రయించిన జమున హ్యాచరీస్‌

4 May, 2021 10:47 IST|Sakshi

అచ్చంపేటలో తమ భూమిలోకి అక్రమంగా ప్రవేశించి సర్వే చేశారని పిటిషన్

సాక్షి, హైదరాబాద్‌: మెదక్‌ జిల్లా అసైన్డ్‌ భూముల వివాదం వ్యవహారంలో జమున హ్యాచరీస్‌ హైకోర్టును ఆశ్రయించింది. కలెక్టర్ నివేదిక తప్పులతడకగా ఉందంటూ పిటిషన్‌ దాఖలు చేసింది. తమకు ఎలాంటి నోటీసు ఇవ్వకుండా విచారణ చేశారని పిటిషన్‌లో పేర్కొంది. అధికారులపై చర్యలు తీసుకోవాలని జమున హ్యాచరీస్‌ పిటిషన్‌లో  కోరింది. అచ్చంపేటలో తమ భూమిలోకి అక్రమంగా ప్రవేశించి సర్వే చేశారని పిటిషన్‌లో పేర్కొంది.

కాగా, జమున హ్యాచరీస్‌ భూ వివాదాలకు సంబంధించి ముఖ్యమంత్రి కేసీఆర్‌ దర్యాప్తునకు ఆదేశించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో మాజీ మంత్రి ఈటల రాజేందర్‌ చుట్టూ ఉచ్చు బిగుస్తోంది. ఒకదాని వెంట మరొకటిగా వేగంగా జరుగుతున్న పరిణామాలు ఈ విషయం స్పష్టం చేస్తున్నాయి. ఇక మెదక్‌ జిల్లా అసైన్డ్‌ భూముల వ్యవహారంలో ఇప్పటికే మంత్రివర్గం నుంచి ఈటలను తొలగించగా, తాజాగా దేవరయాంజాల్‌ భూముల వ్యవహారంపైనా నలుగురు ఐఏఎస్‌లతో కూడిన కమిటీ విచారణ, విజిలెన్స్‌ దర్యాప్తునకు ప్రభుత్వం ఆదేశించింది.

ఈ క్రమంలో మెదక్‌ జిల్లా అసైన్డ్‌ భూముల వ్యవహారంలో ఇప్పటికే ప్రభుత్వానికి నివేదిక అందింది. ఏసీబీ, ఇంటిలిజెన్స్‌ ఇతర విభాగాలు రంగంలోకి దిగి ముమ్మర విచారణ కొనసాగిస్తున్నాయి. మరోవైపు సోమవారం కమిటీ ఏర్పాటు చేయగానే పంచాయతీరాజ్‌ అధికారులు కూడా రంగంలో దిగి పౌల్ట్రీ నిర్మాణ అనుమతులు, పన్నుల చెల్లింపు కోణాల్లో విచారణ మొదలు పెట్టారు. ఏ ప్రభుత్వ శాఖల పరిధిలో నిబంధనలు ఉల్లంఘించారో నివేదికలు తయారు చేస్తున్నారు.

చదవండి: ఈటల చుట్టూ బిగుస్తున్న ఉచ్చు!
చావునైనా భరిస్తా.. ఆత్మ గౌరవం కోల్పోను

>
మరిన్ని వార్తలు