జమున హ్యాచరీస్‌: ‘వాల్టా’ కింద కేసు ఎందుకు నమోదు చేయొద్దు 

8 May, 2021 09:34 IST|Sakshi

మూడురోజుల్లో వివరణ ఇవ్వాలని ఆదేశాలు

సాక్షి ప్రతినిధి, సంగారెడ్డి: మాజీమంత్రి ఈటల రాజేందర్‌ భూవివాదం నేపథ్యంలో విచారణ చేపట్టిన అటవీశాఖ జమున హ్యాచరీస్‌కు నోటీసులు జారీ చేసింది. హ్యాచరీస్‌ పరిశ్రమ కోసం రోడ్డు నిర్మిస్తున్న క్రమంలో మొత్తం 237 చెట్లు (పందిరి గుంజల సైజు) తొలగించినట్లు గుర్తించింది. ఈ మేరకు వాల్టా చట్టం కింద ఎందుకు కేసు నమోదు చేయకూడదో మూడు రోజుల్లో వివరణ ఇవ్వాలని మెదక్‌ జిల్లా రామాయంపేట్‌ రేంజ్‌ ఆఫీసర్‌ కార్యాలయం నుంచి నోటీసులు పంపించారు.

ఈ భూవివాదంపై రెవెన్యూ, విజిలెన్స్, ఏసీబీలతోపాటు అటవీశాఖ కూడా వారం రోజులుగా విచారణ చేస్తున్న విషయం విదితమే. జమునా హ్యాచరీస్‌ ఇచ్చే వివరణను బట్టి కేసు నమోదు చేస్తామని అటవీశాఖ ఉన్నతాధికారులు తెలిపారు. వాల్టా చట్టం ప్రకారం.. నిబంధనలకు విరుద్ధంగా చెట్లు తొలగిస్తే ఆ మేరకు రెట్టింపు సంఖ్యలో, నిర్ణీత సమయంలో మొక్కలు నాటాలి. ఒక్కో మొక్క కోసం నిర్ణీత మొత్తంలో డబ్బును అటవీశాఖకు డిపాజిట్‌ చేయాల్సి ఉంటుంది.   

అటవీ భూముల ఆక్రమణల్లేవు 
జమున హ్యాచరీస్‌ పరిశ్రమకు కేవలం 100 మీటర్ల దూరంలోనే రిజర్వు ఫారెస్టు భూములున్నాయి. అయితే తమ భూములేమీ ఆక్రమణకు గురికాలేదని మెదక్‌ జిల్లా అటవీ శాఖాధికారి జ్ఞానేశ్వర్‌ ‘సాక్షి’తో మాట్లాడుతూ చెప్పారు.
చదవండి: Etela Rajender:రాజకీయ భవిష్యత్తు లేకుండా చేయాలనుకుంటున్నారు

మరిన్ని వార్తలు