రైతు నిజాయితీ: పొరపాటున మరోవ్యక్తికి పట్టా అయిన 15 గుంటల భూమి.. పాస్‌బుక్‌ వచ్చినా కూడా!

16 Oct, 2022 16:40 IST|Sakshi
సోమయ్యకు భూమి పట్టా పత్రం ఇస్తున్న రాజు

పాలకుర్తి టౌన్‌: ఆస్తి కోసం రక్తం పంచుకుపుట్టిన అన్నదమ్ములు, అక్కాచెళ్లెళ్ల మధ్య జరుగుతున్న వివాదాలు చూస్తూనే ఉన్నాం. కన్నవారిపైనే అమానుషానికి పాల్పడుతున్న వారసుల గురించి విన్నాం. కానీ, తనది కాని భూమి తనకెందుకని ఓ యువరైతు నిజాయితీ చాటుకున్నాడు. తన పేరుపై పొరపాటున నమోదై పట్టా పుస్తకం వచ్చినా కూడా భూమిని తిరిగి ఇచ్చేశాడు. ఈ ఆసక్తికర ఘటన జనగామ జిల్లా పాలకుర్తిలో వెలుగుచూసింది.

పాలకుర్తి మండల పరిధి తిరుమలగిరి గ్రామంలో పొన్నం రాజు అనే రైతు ఉన్నాడు. అదే గ్రామానికి చెందిన రైతు బక్క సోమయ్యకు చెందిన 15 గుంటల పట్టా భూమి రికార్డుల్లో తప్పిదం కారణంగా పొన్నం రాజు పేరున నమోదైంది. అయితే, ఆ భూమి తనది కాదని సోమయ్యకు చెందినదని రాజు గుర్తించాడు. మండల తహసీల్దార్‌ పాల్‌సింగ్‌ వద్దకు వెళ్లి విషయం చెప్పాడు. స్వచ్ఛందంగా తహసీల్దార్‌ సమక్షంలో శనివారం సోమయ్యకు పట్టా చేయించి నిజాయితీ చాటుకున్నాడు. ఉప సర్పంచ్‌ నాగరాజుతో పాటు గ్రామస్తులు, రెవెన్యూ అధికారులు రాజును అభినందించారు.
(చదవండి: బద్రినాథ్‌యాత్రలో వరంగల్‌ వైద్యురాలు మృతి)

మరిన్ని వార్తలు