దమ్మాయిగూడ బాలిక మృతి కేసులో వీడిన మిస్టరీ

19 Dec, 2022 12:12 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: జవహర్‌ నగర్‌ బాలిక ఇందు మృతి కేసులో మిస్టరీ వీడింది. ప్రమాదవశాత్తు చెరువులో పడి బాలిక మృతిచెందినట్లు జవహర్‌నగర్‌ పోలీసులు గుర్తించారు. కాగా గురువారం పాఠశాలకు వెళ్లిన విద్యార్థిని అదృశ్యమై.. తెల్లారి చెరువులో శవమై తేలిన విషయం తెలిసిందే. దీంతో జవహర్‌నగర్‌ పోలీసులు ప్రత్యేక బృందాలను ఏర్పాటుచేసి అన్ని కోణాల్లో విచారణ చేపట్టారు. ఆదివారం సీఐ చంద్రశేఖర్‌ ప్రత్యేక బృందాలతో కలిసి పరిసర ప్రాంతాలను జల్లెడ పడ్డారు. చెరువులో ఉన్న నీరు ఊపిరితిత్తులలోకి చేరి ఇందు మృతిచెందినట్లు పోస్టుమార్టమ్‌ రిపోర్టు నివేదికలోనూ వెల్లడైంది.

అసలు ఏం జరిగింది?
మేడ్చల్‌ జిల్లా కీసర మండలంలోని దమ్మాయిగూడ జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాలలో 4వ తరగతి చదువుతున్న 10 ఏళ్ల బాలిక ఇందు గురువారం ఉదయం కనిపించకుండా పోయింది. గురువారం ఉదయం తండ్రితో పాటు స్కూల్‌కు వచ్చిన బాలిక తన బ్యాగును అక్కడే విడిచిపెట్టి పార్కుకు వెళ్లినట్లుగా మిగిలిన పిల్లలు చెప్పారని హెడ్‌మాస్టర్‌ తెలిపారు. బాలిక వెళ్లిపోయిన విషయాన్ని ఆమె తండ్రికి ఫోన్‌ చేసి చెప్పినట్లు వెల్లడించారు. ఎంత వెతికినా ఆచూకీ దొరకకపోయే సరికి పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు చెప్పారు.

దీంతో స్కూల్‌ హెడ్‌మాస్టర్‌, బాలిక తల్లిదండ్రుల ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకుని ఆచూకీ కోసం పోలీసులు గాలింపు చేపట్టారు. డాగ్‌ స్వ్కాడ్స్‌, క్లూస్‌ టీంలను రంగంలోకి దింపి గాలించారు. పాఠశాల ఆవరణలో సీసీటీవీ కెమెరాలు లేవు. దమ్మాయిగూడ చౌరస్త వద్ద ఉన్న ఓ సీసీటీవీ కెమెరాలో మాత్రమే బాలిక కనిపించింది. ఆ తర్వాత ఎటు వెళ్లిందనే విషయం తెలియరాలేదు. డాగ్‌ స్వ‍్కాడ్స్‌ చెరువు వద్దకు వెళ్లి ఆగిపోయాయి. దీంతో గజ ఈతగాళ్లతో గాలించగా.. శుక్రవారం ఉదయం చెరువులో మృతదేహం లభ్యమైంది.  
చదవండి: డబ్బు వసూలు చేసినట్లు నిరూపించు.. రోహిత్ రెడ్డికి రఘునందన్ సవాల్..

మరిన్ని వార్తలు :

మరిన్ని వార్తలు