పాత పెన్షన్‌ అమలు కోరుతా..

28 Jun, 2022 02:54 IST|Sakshi
హేమంత్‌ సోరెన్‌తో మాట్లాడుతున్న స్థితప్రజ్ఞ 

రాంచీ సభలో జార్ఖండ్‌ సీఎం హేమంత్‌ సోరెన్‌

సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌తో తన తండ్రి శిబూ సోరెన్‌కు ఉన్న అనుబంధాన్ని గుర్తు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు పాత పెన్షన్‌ అమలు చేసే అంశంపై మాట్లాడుతానని జార్ఖండ్‌ సీఎం హేమంత్‌ సోరెన్‌ పేర్కొన్నారు. రాంచీలో సోమవారం జరిగిన ఓ బహిరంగసభలో ఆయన పాల్గొని ఆగస్ట్‌ 15 నాటికి ఆ రాష్ట్రంలోని ఉద్యోగ, ఉపాధ్యాయులందరికీ పాత పెన్షన్‌ విధానాన్ని అమలు చేస్తామని ప్రకటించారు. నేషనల్‌ మూవ్‌మెంట్‌ ఫర్‌ ఓల్డ్‌ పెన్షన్‌ స్కీం సెక్రెటరీ జనరల్‌ స్థితప్రజ్ఞ ఆధ్వర్యంలో ఈ సభ జరిగింది.

కాంట్రిబ్యూటరీ పెన్షన్‌ స్కీం (సీపీఎస్‌) అమలుతో దేశ వ్యాప్తంగా 84 లక్షల మంది ఉద్యోగ, ఉపాధ్యాయుల కుటుంబాలు సామాజిక భద్రతను కోల్పోయాయని స్థితప్రజ్ఞ ఆవేదన వ్యక్తం చేశారు. తెలుగు రాష్ట్రాల్లో పుట్టిన సీపీఎస్‌ ఉద్యమం నేడు 26 రాష్ట్రాలకు విస్తరించిందని పేర్కొన్నారు. అనంతపురంలో జూలై 17న వాక్‌ ఫర్‌ పెన్షన్‌ కార్యక్రమాన్ని నిర్వహిస్తామన్నారు. సభలో తెలంగాణ సీపీఎస్‌ మూవ్‌మెంట్‌ యూనియన్‌ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కల్వల్‌ శ్రీకాంత్, కోశాధికారి నరేశ్‌గౌడ్, ఏపీ నుంచి రామాంజనేయులు పాల్గొన్నారు. 

మరిన్ని వార్తలు