బయోమెట్రిక్‌ హాజరు లేకుంటే అనుమతులు రద్దు 

31 Oct, 2021 02:30 IST|Sakshi

ఉత్తర్వులు జారీ చేసిన జేఎన్‌టీయూహెచ్‌    

సాక్షి, హైదరాబాద్‌: జవహర్‌లాల్‌ నెహ్రూ టెక్నలాజికల్‌ యూనివర్సిటీ–హైదరాబాద్‌ పరిధిలోని అన్ని కాలేజీల్లో ఆధార్‌ బేస్డ్‌ బయోమెట్రిక్‌ అప్‌డేషన్‌ సిస్టం (ఏబీఏఎస్‌)ను పక్కాగా అమలు చేయాలని జేఎన్‌టీయూహెచ్‌ స్పష్టం చేసింది. నూతన సాఫ్ట్‌వేర్‌ను అప్‌డేట్‌ చేసుకోవాలని, నవంబర్‌ ఒకటో తేదీ నుంచి ఏబీఏఎస్‌ను పక్కాగా అమలు చేయాలని సూచించింది.

బోధన సిబ్బంది, పోస్ట్రుగాడ్యుయేషన్‌   విద్యార్థులు ప్రతి ఒక్కరూ ఉదయం, సాయంత్రం తప్పకుండా వేలిముద్రలతో కూడిన హాజరు ఇవ్వాలని తేల్చిచెప్పింది.ఏబీఏఎస్‌ హాజరు అమలు చేయకుంటే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది. యాజమాన్యాలపై నెలకు రూ.20వేల చొప్పున జరిమానా విధించడంతో పాటు యూనివర్సిటీ అనుబంధ గుర్తింపును రద్దు చేసేందుకు సైతం వెనుకాడబోమని జేఎన్‌టీయూహెచ్‌ శనివారం విడుదల చేసిన ఉత్తర్వుల్లో స్పష్టం చేసింది.   

మరిన్ని వార్తలు