కోర్టుల్లో ఉద్యోగాలు 1,406

16 May, 2022 01:05 IST|Sakshi

రెగ్యులర్‌ కోర్టులుగా 38 ఫాస్ట్‌ట్రాక్‌ కోర్టులు

ఈ కోర్టులకు 1,098 పోస్టులు మంజూరు

మరో 14 అదనపు జిల్లా, సెషన్స్‌ కోర్టుల్లో 308 పోస్టులు

ఉత్తర్వులు జారీ చేసిన ఆర్థిక శాఖ

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రంలోని 38 ఫాస్ట్‌ట్రాక్‌ కోర్టులను పర్మినెంట్‌ రెగ్యులర్‌ కోర్టులుగా మారుస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఇందులో 22ను అదనపు జిల్లా సెషన్స్‌ జడ్జి కోర్టులుగా, మరో 16ను సీనియర్‌ సివిల్‌ జడ్జి కోర్టులుగా మార్చారు. ప్రజలకు వేగంగా న్యాయం అందించాలన్న ఉద్దేశంతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. దీనికి సంబంధించి తగిన చర్యలు తీసుకోవాలని రాష్ట్ర హైకోర్టు రిజిస్ట్రార్‌ జనరల్‌ను కోరింది. కాగా, మొత్తం 38 కోర్టులకు 1,098 పోస్టులను మంజూరు చేస్తూ సర్కార్‌ మరో జీవో జారీ చేసింది. ఇందులో 22 అదనపు జిల్లా సెషన్స్‌ జడ్జి కేడర్‌ కోర్టుల్లో 682 పోస్టులు, 16 సీనియర్‌ సివిల్‌ జడ్జి కోర్టుల్లో 416 పోస్టులు మంజూరయ్యాయి. మరో 14 అదనపు జిల్లా సెషన్స్‌ జడ్జి కోర్టుల్లో 308 కొత్త పోస్టులు మంజూరు చేస్తూ ఆర్థిక శాఖ ఉత్తర్వులు ఇచ్చింది. 

మరో 308 పోస్టులు..
రాష్ట్రంలోని 14 అదనపు జిల్లా, సెషన్స్‌ జడ్జిల కోర్టుల్లో 14 కేటగిరీల్లో 308 పోస్టులను ప్రభుత్వం మంజూరు చేసింది. ఇందులో డ్రైవర్, రికార్డు అసిస్టెంట్, ఆఫీస్‌ సబార్డినేట్‌ (అటెండర్‌) పోస్టులను ఔట్‌ సోర్సింగ్‌లో తీసుకోనుండగా.. మిగతా 11 కేటగిరీల్లో రెగ్యులర్‌ ఉద్యోగుల పోస్టులను భర్తీ చేయనున్నారు. చీఫ్‌ అడ్మినిస్ట్రేటివ్‌ ఆఫీసర్‌ (ఏవో) పోస్టులు 14, హెడ్‌ క్లర్క్‌ 14, ట్రాన్స్‌లేటర్‌ 14, యూడీబీసీ 14, పర్సనల్‌ అసిస్టెంట్‌ 14, జూనియర్‌ అసిస్టెంట్‌ 42, టైపిస్ట్‌ 14, ఫీల్డ్‌ అసిస్టెంట్‌ 28, ఎగ్జామినర్‌ 14, కాపీయిస్ట్‌ 14, ప్రాసెస్‌ సర్వర్‌ 28, డ్రైవర్‌ 14, రికార్డు అసిస్టెంట్‌ 14, ఆఫీస్‌ సబార్డినేట్‌ 70 పోస్టులున్నాయి. 

మరిన్ని వార్తలు