27న హనుమకొండకు జేపీ నడ్డా

23 Aug, 2022 04:28 IST|Sakshi

బండి సంజయ్‌ పాదయాత్ర–3 ముగింపు సభకు హాజరు

మరింత వేగంగా ‘ఆపరేషన్‌ ఆకర్ష్‌’అమలుకు నిర్ణయం

27న ఎర్రబెల్లి ప్రదీప్‌రావు, బొమ్మా శ్రీరాం తదితరుల చేరిక

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రంలో రాజకీయ వాతావరణాన్ని మరింత వేడెక్కించడం, పార్టీ ‘ఫీల్‌గుడ్‌ ఫ్యాక్టర్‌’, అనుకూల ప్రచారాన్ని ఉధృతం చేయడంలో భాగంగా బీజేపీ అగ్ర నేతలు వరుస పర్యటనలతో దుమ్మురేపుతు న్నారు. గత నాలుగు నెలల్లోనే ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా, ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు జగత్‌ ప్రకాశ్‌ నడ్డా పలుమార్లు తెలంగాణలో పర్యటించి వివిధ సభల్లో పాల్గొన్న విషయం తెలిసిందే. దీనికి కొనసాగింపుగా ఆదివారం మునుగోడు ఉప ఎన్నికల ప్రచారానికి శ్రీకారం చుట్టేందుకు అమిత్‌ షా రాగా, ఈ నెల 27న హనుమకొండలో సంజయ్‌ ప్రజాసంగ్రామ యాత్ర–3 ముగింపు బహిరంగసభకు నడ్డా రానున్నారు.

ఇటీవల అమిత్‌ షా రాష్ట్రంలో మూడుసార్లు పర్యటించగా, నడ్డా కూడా మూడోసారి రాను న్నారు. మే 26న ఐఎస్‌బీ స్నాతకోత్సవంలో పాల్గొన్న మోదీ బేగంపేట ఎయిర్‌పోర్టు సభ లో, జాతీయ కార్యవర్గభేటీ సందర్భంగా జూలై 3న పరేడ్‌ గ్రౌండ్స్‌ బహిరంగసభలో పాల్గొన్న విషయం తెలిసిందే. ఇక నుంచి అసెంబ్లీ ఎన్నికలు జరిగే దాకా ప్రతీ నెలా రెండురోజులపాటు తెలంగాణలో పర్యటించేందుకు సంసిద్ధంగా ఉన్నట్టు అమిత్‌ షా సైతం ప్రకటించారు. నడ్డా సమక్షంలో మంత్రి ఎర్ర బెల్లి దయాకర్‌రావు సోదరుడు ఎర్రబెల్లి ప్రదీప్‌రావు, కాంగ్రెస్‌ మాజీ ఎమ్మెల్యే బొమ్మ వెంకటేశ్వర్లు కుమారుడు బొమ్మ శ్రీరాం తదితరులు బీజేపీలో చేరనున్నారు. 

మరిన్ని వార్తలు