రొమేనియా బాలికపై అఘాయిత్యంలో ఎంఐఎం ఎమ్మెల్యే కుమారుడు: బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్‌రావు 

4 Jun, 2022 12:46 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌:  రొమేనియా బాలికపై అత్యాచారం ఘటనలో ఎంఐఎం ఎమ్మెల్యే కుమారుడు కూడా ఉన్నాడని.. కానీ పోలీసులు కేసును తప్పుదోవ పట్టిస్తున్నారని బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్‌రావు ఆరోపించారు. బెంజ్‌ కారులో అత్యాచారం జరిగితే.. ఇన్నోవాలో ఉన్న వారిని అరెస్ట్‌ చేసి కేసును నీరుగార్చే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు. బెంజ్‌ కారులో ఉన్న వారినెవరినీ ముద్దాయిలుగా చూపకపోవడం బాధాకరమన్నారు. అత్యాచార ఘటనకు సంబంధించి తాము సేకరించిన ఫొటోలు, వీడియోలను శనివారం బీజేపీ కార్యాలయంలో మీడియాకు విడుదల చేశారు. ఎరుపు రంగు బెంజ్‌ కారులో బాధితురాలిపై ఎమ్మెల్యే కుమారుడు, ఇతరులు లైంగిక దాడి చేశారని నిరూపించడానికి ఈ ఆధారాలు ఉపయోగపడతాయన్నారు.  

క్లీన్‌చిట్‌ ఎలా ఇస్తారు? 
అత్యాచార ఘటనతో సంబంధమున్న వారి ని ఇతర రాష్ట్రాలు, దేశాలకు పంపించినట్టు.. కొందరిని దుబాయ్‌ విమానం ఎక్కించినట్టు తనకు సమాచారం ఉందని రఘునందన్‌రావు తెలిపారు. ఈ కేసు చల్లబడ గానే వారిని తిరిగి హైదరాబాద్‌కు రప్పించుకునే ప్లాన్‌లో ఉన్నారని.. పోలీసులు నిష్పక్షపాతంగా వ్యవహరించి దోషులపై కేసులు పెట్టాలని డిమాండ్‌ చేశారు. పోలీసు అధికారులు విచారణ జరపకుండానే ఘటనలో ఎమ్మెల్యే కొడుకు లేడని, హోంమంత్రి మనవడి ప్రమేయం లేదని క్లీన్‌చిట్‌ ఎలా ఇస్తా రని నిలదీశారు.  పబ్‌లో కేక్‌ కట్‌ చేసి సంబరాలు చేసుకున్న, అత్యాచార ఘటనలో పాల్గొనవారి ఫొటోలు, వీడియోలు తమ వద్ద ఉన్నాయని.. హైకోర్టుకు సమర్పించి.. సీబీఐ విచారణ కోరుతామన్నారు. పోలీసులకు ఆధారాలు ఇచ్చేందుకు తాను సిద్ధమేనని.. కానీ పోలీసులు వాటిని ధ్వంసం చేసి అంతా ఉత్తుత్తివేనంటే పరిస్థితి ఏమిటనే అనుమానం ఉందన్నారు. 

ఎంఐఎం వారిని కాపాడేందుకు.. 
అత్యాచార ఘటనలో ఎంఐఎం వారిని కాపాడేందుకు టీఆర్‌ఎస్‌ వారిని బలిపశువులను చేస్తున్న విషయాన్ని కేటీఆర్‌ గ్రహించడం లేదని రఘునందన్‌ అన్నారు. హైదరాబాద్‌లో పోలీసు వ్యవస్థ మొత్తాన్ని ఎంఐఎం నేతలే నడిపిస్తున్నారని.. ఈ కేసులో వాళ్లు చెప్పినట్టే ఎఫ్‌ఐఆర్‌లలో పేర్లు, విచారణ జరుగుతోందన్నారు. దోషులకు శిక్షపడే దాకా పోరాటాన్ని కొనసాగిస్తామన్నారు. 

సిట్టింగ్‌ జడ్జితో విచారణ చేపట్టాలి.. 
ఈ ఘటనపై సీబీఐతోగానీ, హైకోర్టు సిట్టింగ్‌ జడ్జి నేతృత్వంలోగానీ విచారణ చేపట్టాలని సీజేఐ జస్టిస్‌ ఎన్వీ రమణను రఘు నందన్‌రావు విజ్ఞప్తి చేశారు. హైదరాబాద్‌ పోలీసులను ఎంఐఎం నేతలు కీలుబొమ్మలుగా చేసి ఆడిస్తున్నారని.. అందుకే సీబీఐ, హైకోర్టు జడ్జితో విచారణ చేయించాలని కోరుతున్నట్టు తెలిపారు.  

మరిన్ని వార్తలు