‘గ్రీన్‌ ఇండియా చాలెంజ్‌’లో మొక్కలు నాటిన సీజే

17 Nov, 2021 03:03 IST|Sakshi
హైకోర్టు ప్రాంగణంలో జరిగిన కార్యక్రమంలో పాల్గొన్న సీజే సతీష్‌ చంద్ర శర్మ, ఎంపీ సంతోష్, న్యాయమూర్తులు, న్యాయవాదులు 

సీజే, ఇతర న్యాయమూర్తులకు ‘వృక్షవేదం’ బహూకరించిన ఎంపీ సంతోష్‌

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్ర హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి సతీశ్‌చంద్ర శర్మ ‘గ్రీన్‌ఇండియా చాలెంజ్‌’ కార్యక్రమంలో భాగంగా మొక్కలు నాటారు. ఈ చాలెంజ్‌ చేపట్టిన ఎంపీ సంతోష్‌కుమార్‌ను హైకోర్టు చీఫ్‌ జస్టిస్‌ ప్రత్యేకంగా అభినందించారు. పర్యావరణ పరిరక్షణకు ఇలాంటి కార్యక్రమాలు ఎంతో దోహదపడతాయని పేర్కొన్నారు. తాను కూడా రైతు కుటుంబం నుండి వచ్చిన విషయాన్ని సీజే గుర్తుచేశారు.

ఇలాంటి కార్యక్రమాన్ని దిగ్విజయంగా ముందుకు తీసుకువెళుతున్నందుకు సంతోష్‌ను ప్రశంసించారు. మంగళవారం గ్రీన్‌ ఇండియా చాలెంజ్‌లో భాగంగా హైకోర్టు ప్రాంగణంలో జరిగిన కార్య క్రమంలో సీజే, బీఎస్‌ ప్రసాద్, ఏజీ జె.రామచంద్రరావులతో కలిసి సంతోష్‌కుమార్‌ మొక్కలు నాటారు. సీజే సతీశ్‌చంద్ర శర్మ, ఇతర న్యాయమూర్తుల కు ఎంపీ సంతోష్‌ వృక్షవేదం పుస్తకాన్ని బహూకరించారు.

కార్యక్రమంలో జస్టిస్‌ రాజశేఖర్‌రెడ్డి, జస్టిస్‌ పి.నవీన్‌రావు, జస్టిస్‌ జి.శ్రీదేవి, జస్టిస్‌ శ్రీసుధ, బార్‌ కౌన్సిల్‌ చైర్మన్‌ నరసింహారెడ్డి, బార్‌ అసోసియేషన్‌ ప్రెసిడెంట్‌ పొన్నం అశోక్‌గౌడ్, బార్‌ అసోసియేషన్‌ జనరల్‌ సెక్రటరీ కళ్యాణ్‌రావు, జీపీలు జోగినిపల్లి సాయికృష్ణ, సంతోష్‌ కుమార్, పీపీలు, సీనియర్‌ న్యాయవాదులు, స్టాండింగ్‌ కౌన్సిల్‌ మెంబర్స్, ఫుడ్‌ కమిషన్‌ మెంబర్‌ గోవర్ధన్‌రెడ్డి, గ్రీన్‌ ఇండియా చాలెంజ్‌ కో ఫౌండర్‌ రాఘవ ఇతర ప్రతినిధులు పాల్గొన్నారు. 

మరిన్ని వార్తలు