పీవీకి భారతరత్న ఇవ్వాలి 

9 Aug, 2020 03:53 IST|Sakshi
పీవీ విగ్రహాన్ని ఆవిష్కరిస్తున్న రాజ్యసభ సభ్యుడు కేకే, మంత్రి సబితా ఇంద్రారెడ్డి తదితరులు

పీవీ శత జయంతి ఉత్సవ కమిటీ అధ్యక్షుడు కె.కేశవరావు  

తోలుకట్టలో మాజీ ప్రధాని పీవీ నర్సింహారావు విగ్రహావిష్కరణ  

పాల్గొన్న మంత్రి సబితారెడ్డి, ఎంపీ రంజిత్‌రెడ్డి  

మొయినాబాద్‌ రూరల్‌(చేవెళ్ల): మాజీ ప్రధాని పీవీ నర్సింహారావుకు భారతరత్న ఇవ్వాలని రాజ్యసభ సభ్యుడు, పీవీ శతజయంతి ఉత్సవాల కమిటీ అధ్యక్షుడు కె.కేశవరావు అన్నారు. శనివారం రంగారెడ్డి జిల్లా మొయినాబాద్‌ మండలంలోని తోలుకట్ట సమీపంలో స్వామి రామానందతీర్థ ఔషధ కేంద్రంలో స్వామి రామానందతీర్థ రీసెర్చ్‌ ఇన్‌స్టిట్యూట్‌ చైర్‌పర్సన్‌ సురభి వాణిదేవి, పరిశోధనా సంస్థ అధ్యక్షుడు పీవీ ప్రభాకర్‌రావు ఏర్పాటు చేసిన మాజీ ప్రధాని పీవీ నర్సింహారావు విగ్రహావిష్కరణ, శత జయంతి ఉత్సవ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి రాజ్యసభ సభ్యుడు కె.కేశవరావు, మంత్రి సబితా ఇంద్రారెడ్డి, చేవెళ్ల ఎంపీ డాక్టర్‌ రంజిత్‌రెడ్డి, ఎమ్మెల్యే కాలె యాదయ్య, జెడ్పీ చైర్‌పర్సన్‌ తీగల అనితారెడ్డి హాజరయ్యారు.

పీవీ విగ్రహాన్ని ఆవిష్కరించిన అనంతరం పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా కె.కేశవరావు మాట్లాడుతూ.. మాజీ ప్రధాని పీవీ నర్సింహారావు విగ్రహాలను ఆరు రాష్ట్రాల్లో ఏర్పాటు చేసేందుకు ప్రతిపాదనలు తయారు చేశామన్నారు. పీవీకి భారతరత్న కోసం ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఎంతో కృషి చేస్తున్నారని తెలిపారు. పార్లమెంట్‌లో ఆయన విగ్రహ ఏర్పాటుకు కృషి చేస్తున్నామన్నారు. పీవీ పేరుతో తెలంగాణలో త్వరలో ఆడిటోరియం నిర్మించేందుకు చర్య లు తీసుకుంటున్నట్లు వివరించారు. మంత్రి సబితారెడ్డి, ఎంపీ రంజిత్‌రెడ్డి, జెడ్పీ చైర్‌పర్సన్‌ అనితారెడ్డి మాట్లాడుతూ.. పీవీ శతజయంతి ఉత్సవాలు రాష్ట్రంలో నిర్వహించేం దుకు సీఎం కేసీఆర్‌ కృషి చేస్తున్నారన్నారు. మన ప్రాంత మహనీయుల సేవలను భావి తరాలకు తెలియజేసే అవకాశం తెలంగాణ ఏర్పాటుతోనే సాధ్యమైందన్నారు.

మరిన్ని వార్తలు