సీఎం కేసీఆర్‌పై సీబీఐకి ఫిర్యాదు చేసిన కేఏ పాల్‌

22 Jun, 2022 16:19 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణ ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్‌రావుపై ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్‌ బుధవారం సీబీఐకి ఫిర్యాదు చేశారు. సీఎం కేసీఆర్‌, ఆయన కుటుంబ సభ్యులు తెలంగాణలో రూ.9 లక్షల కోట్ల అవినీతికి పాల్పడ్డారని కేఏ పాల్‌ ఆరోపించారు. ఈ మేరకు ఢిల్లీలో సీబీఐ డైరెక్టర్‌ సుబోద్‌ కుమార్‌ జైశ్వాల్‌ను కలిసి ఫిర్యాదు చేశారు.

అనంతరం కేఏ పాల్‌ మీడియాతో మాట్లాడుతూ.. ప్రపంచంలో ఎక్కడా ఇలాంటి అవినీతి చూడలేదు. తెలంగాణ ప్రజలంతా సీఎం కేసీఆర్ అవినీతిపై విచారణ జరగాలని కోరుతున్నారు. కేసీఆర్ కుటుంబానికి ఆదాయానికి మించి ఉన్న ఆస్తులపై దర్యాప్తు జరపాలి. రాష్ట్ర విభజన సమయంలో తెలంగాణ కు రూ.60 వేల కోట్ల మిగులు బడ్జెట్ ఉంది. కేసీఆర్ సర్కార్ నాలుగున్నర లక్షల కోట్ల అప్పు చేసింది. తెలంగాణలో అధికారంలోకి వచ్చిన నాటి నుంచి సీఎం కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు, సంతోష్, ఎమ్మెల్సీ కవితలు భారీ అవినీతికి పాల్పడ్డారు. తెలంగాణతో పాటూ సింగపూర్, దుబాయ్, అమెరికాలో అనేక ఆస్తులు కూడబెట్టారు.

కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలోనూ భారీగా అవినీతికి పాల్పడ్డారు. యాదాద్రి అభివృద్ధిలోనూ అవినీతి జరిగింది. రూ.2 వేల కోట్లు అంచనాలో రూ.200 కోట్లు ఖర్చు చేసి మిగిలింది అంతా దోచుకున్నారు. కేసీఆర్ అవినీతి అక్రమాలపై సమగ్ర విచారణ జరిపి వాస్తవాలు బయట పెట్టాలి. ప్రభుత్వ ఖజానాను కాపాడాలి. కేసీఆర్, ఆయన కుటుంబ సభ్యుల బినామీ లావాదేవీలపై కూడా విచారణ జరపాలి. కేసీఆర్ అవినీతిని ప్రశ్నిస్తున్నందుకు నాపై దాడులు చేస్తున్నారు. కేసీఆర్ అవినీతి అక్రమాలపై జరిగే దర్యాప్తుకు నా పూర్తి సహకారం అందిస్తానని కేఏ పాల్‌ అన్నారు. ఫిర్యాదు కాపీలను సీబీఐతో పాటు కేంద్రమంత్రులు అమిత్ షా, పురుషోత్తం రూపాలాకు కూడా పంపారు.

చదవండి: ('ఫోన్‌ నెంబర్‌ ఇవ్వు.. లేకపోతే లైంగికదాడి చేస్తాం')

మరిన్ని వార్తలు