హెచ్‌ఆర్‌సీని ఆశ్రయించిన రైతులు

14 Jan, 2023 01:49 IST|Sakshi
హెచ్‌ఆర్సీ కార్యాలయం వద్ద కామారెడ్డి మాస్టర్‌ ప్లాన్‌ బాధిత రైతులు   

కామారెడ్డి టౌన్‌: కామారెడ్డి మాస్టర్‌ ప్లాన్‌ను వ్యతిరేకిస్తున్న విలీన గ్రామాల రైతులు తమ పోరాటాన్ని మరింత ఉధృతం చేస్తున్నారు. తాజాగా శుక్రవారం మాస్టర్‌ ప్లాన్‌ బాధిత రైతులు హైదరాబాద్‌ వెళ్లి తెలంగాణ మానవ హక్కుల కమిషన్‌ను ఆశ్రయించారు. రైతులకు అన్యాయం చేసిన కామారెడ్డి జిల్లా కలెక్టర్‌ జితేశ్‌ వి.పాటిల్, తమపై విచక్షణా రహితంగా లాఠీలతో కొట్టిన పోలీసులపై కఠిన చర్యలు తీసుకోవాలని కమిషన్‌ను వేడుకున్నారు.

కామారెడ్డి మాస్టర్‌ ప్లాన్‌కు వ్యతిరేకంగా తాము నిరసన వ్యక్తం చేస్తుంటే పోలీసులు అమర్యాదగా ప్రవర్తించారని ఫిర్యాదు చేశారు. ఎలాంటి సమాచారం లేకుండానే మాస్టర్‌ ప్లాన్‌లో భాగంగా తమ భూములను లాక్కోవడం సరైన పద్ధతా? అని రైతులు ప్రశ్నించారు. కలెక్టరేట్‌ ఎదుట తాము శాంతియుతంగా ధర్నా చేస్తున్న నేపథ్యంలో కలెక్టర్‌ తన చాంబర్‌లో ఉండి కూడా, రాత్రి 8 గంటలైనా తమ గోడును పట్టించుకోలేదని, అలాగే ఏఎస్పీ అనోన్య, డీఎస్పీ సోమనాథం, సీఐలు, ఎస్‌ఐలు లాఠీచార్జి చేసి రైతులను విచక్షణా రహితంగా కొట్టారని, బూట్లతో తన్ని హింసించారన్నాని పేర్కొన్నారు. 

మరిన్ని వార్తలు