కామారెడ్డి: అందాలు చూపించాలంటూ ప్రిన్సిపాల్‌ వేధింపులు

3 Mar, 2021 18:30 IST|Sakshi

విద్యార్థినిలకు వీడియో కాల్స్‌ చేస్తూ వేధింపులు

డ్యాన్స్‌ నేర్పిస్తానంటూ అసభ్య ప్రవర్తన

సాక్షి, నిజామాబాద్‌: విద్యాబుద్ధులు నేర్పాల్సిన ఓ ప్రధానోపాధ్యాయుడు‌ కీచకుడిగా మారాడు. సొంత బిడ్డలుగా చూసుకోవాల్సిన విద్యార్థినిల పట్ల పైశాచికింగా ప్రవర్తించాడు. అమ్మాయిలకు వీడియో కాల్‌ చేసి అందాలు చూపించాలంటూ వేధించాడు. లాక్‌డౌన్‌ నుంచి సాగుతోన్న ఈ అరాచకం ఓ విద్యార్థి ఆత్మహత్యాయత్నం చేయడంతో వెలుగులోకి వచ్చింది. దాంతో సదరు ప్రధానోపాధ్యాయుడిపై చర్యలు తీసుకోవాల్సిందిగా డిమాండ్‌ చేస్తున్నారు తల్లిదండ్రులు, విద్యార్థి సంఘాల నాయకులు.  వివరాలు.. 

నల్లమడుగు తండాకు చెందిన  రాము అనే విద్యార్థి కామారెడ్డి జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో చదువుతున్నాడు. ఈ క్రమంలో రెండు రోజుల క్రితం సదరు ప్రధానోపాధ్యాయుడు రాముకి టీసీ ఇచ్చాడు. మనస్తాపానికి గురైన రాము నిన్న తన నివాసంలో పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నం చేశాడు. పరిస్థితి విషమించడంతో రాముని కామారెడ్డి ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనకు నిరసనగా గిరిజన విద్యార్థి సంఘాల నేతలు నిరసన వ్యక్తం చేస్తూ ధర్నా నిర్వహించారు. ఈ క్రమంలో సదరు ప్రధానోపాధ్యాయుడి రాసలీలలు వెలుగులోకి వచ్చాయి. 

కరోనా సమయంలో విద్యార్థులకు ఆన్‌లైన్‌ క్లాస్‌లు చెప్పాలని ప్రభుత్వ నిర్ణయించింది. దీన్ని అవకాశంగా చేసుకుని ప్రిన్సిపాల్ విద్యార్థినిలను వేధించేవాడు. ఆన్‌లైన్‌ క్లాస్‌ల కోసం విద్యార్థినిల ఫొన్ నంబర్లను సేకరించాడు. ఆ తర్వాత అమ్మాయిలకు వీడియో కాల్స్ చేస్తూ అందాలు చూపించాలని వేధించేవాడు. అంతేకాకుండా డాన్స్ క్లాస్‌ల పేరుతో కూడా విద్యార్థినిల పట్ల అసభ్యకరంగా ప్రవర్తించాడని తెలిసింది. విద్యార్థినిలకు ఒక్కొక్కరికి విడిగా డాన్స్ నేర్పుతాను అంటూ గదిలోకి తీసుకు వెళ్లి వారిని వేధించాడని తెలిసింది. ప్రిన్సిపాల్‌ చర్యల పట్ల ఆగ్రహం వ్యక్తం చేసిన విద్యార్థుల తల్లిదండ్రలు, విద్యార్థి సంఘం నాయకులతో కలిసి పాఠశాల బయట కూర్చొని నిరసన తెలిపారు. సదరు ప్రిన్సిపాల్‌పై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.

చదవండి: 
ఆన్‌లైన్‌ పాఠాల పేరుతో.. అశ్లీల చిత్రాలు..
11 ఏళ్ల బాలికపై అత్యాచారం.. ప్రిన్సిపాల్‌కు ఉరిశిక్ష

మరిన్ని వార్తలు