KBC-13 : కేబీసీలో అనూహ్యంగా కేటీఆర్‌...ఎలాగంటే!

4 Sep, 2021 10:55 IST|Sakshi

 కేబీసీలో ప్ర‌శ్న‌గా కేటీఆర్ ట్వీట్‌

సంతోషం వ్యక్తం చేసిన మంత్రి

సాక్షి, హైదరాబాద్‌: సోషల్‌ మీడియాలో యాక్టివ్‌గా ఉండే తెలంగాణా మంత్రి కేటీఆర్‌ మరోసారి ఆసక్తికరంగా వార్తల్లో నిలిచారు. సాధారణంగా కోవిడ్‌ బాధితులు, ఇతర సమస్యలపై చురుగ్గా స్పందిస్తూ అభినందనలు అందుకునే కేటీఆర్‌ పాపులర్‌ రియాల్టీ  షో కౌన్ బ‌నేగా క‌రోడ్ ప‌తి -13లో అనూహ్యంగా  చోటు సంపాదించుకున్నారు. అయితే ఆయన పార్టిసిపెంట్‌గా అనుకుంటే మాత్రం.. మీరు పొరబడినట్టే.. విభిన్న అంశాలపై స్పందించే ఆయన ట్వీట్‌ కేబీసీలో ఒక ప్రశ్నగా రావడం విశేషంగా నిలిచింది.  ఇపుడు  ఈ ట్వీట్ తెగ వైరలవుతోంది.

బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బ‌చ్చ‌న్ హోస్ట్‌గా వ్య‌వ‌హ‌రిస్తున్న ఈ షోలో కేటీఆర్ ట్వీట్‌ను కేబీసీ షో నిర్వాహకులు పరిగణనలోకి తీసుకున్నారు. తాజాగా భార‌త మాజీ క్రికెట‌ర్స్ వీరేంద్ర సెహ్వాగ్‌, సౌర‌వ్ గంగూలీ హాజ‌రైన ఎపిసోడ్‌లో కేటీఆర్ గ‌తంలో చేసిన ట్వీట్‌ని ప్ర‌శ్న‌గా సంధించారు హాట్‌ సీట్‌లో ఉన్న అమితాబ్‌. దీనిపై స్వయంగా కేటీఆర్‌ కూడా ఒకింత ఆశ్చర్యాన్ని, మరింత సంతోషాన్ని వ్యక్తం చేశారు. ఏదో స‌ర‌దాగా చేసిన ట్వీట్ ఇలా కేబీసీలో రావ‌డం సంతోషంగా ఉందన్నారు.

కరోనా చికిత్సలో ఉపయోగించే మెడిసిన్ లిస్ట్‏ను తెలంగాణ మంత్రి కేటీఆర్ గతంలో ట్విటర్‌లో షేర్‌ చేసి.. వీటిని సరిగ్గా పలికే వారున్నారా? అంటూ ట్వీట్ చేశారు. అంతేకాదు దీని వెనుక కచ్చితంగా ఈయన హస్తం ఉండే ఉంటుందని చమత్కరిస్తూ కాంగ్రెస్‌ సీనియర్‌ ఎంపీ శ‌శి థరూర్‌ని ట్యాగ్‌ చేశారు. ఆ ట్వీటే కేబీసీలో ప్ర‌శ్నగా మారింది. కేటీఆర్‌ ఈ ట్వీట్‌ను ఎవరికి ట్యాగ్ చేశారంటూ కేబీసీలో అమితాబ్‌ ప్రశ్నించారు. సమాధానాల్లోని నాలుగు ఆప్షన్స్‌గా కపిల్‌ సిబల్, సుబ్రమణ్యస్వామి, అమితావ్ గోష్, శశిథరూర్ పేర్లను ఇచ్చారు. దీనిపై సౌర‌వ్ గంగూలీ, చాలా స్మార్ట్‌గా ఆలోచించి శ‌శిథ‌రూర్ అని చెప్పారు. ఇంగ్లీష్‌పై ప‌ట్టు అంటే రాజకీయ వర్గాల్లో ఎవరికైనా ఠక్కున గుర్తొచ్చేది పేరు శశి థరూర్‌.

మరిన్ని వార్తలు