నిఘా నీడలో కేబీఆర్‌ పార్క్‌ వాక్‌వే.. 

10 Jun, 2022 16:32 IST|Sakshi

జీహెచ్‌ఎంసీ వాక్‌వేలో 150 సీసీ కెమెరాలు

మొదటి విడతలో 70 కెమెరాల బిగింపు

సాక్షి, హైదరాబాద్‌: బంజారాహిల్స్‌లోని ప్రతిష్టాత్మక కేబీఆర్‌ పార్కు జీహెచ్‌ఎంసీ వాక్‌వేలో గతేడాది నవంబర్‌ 14న వాకింగ్‌ చేస్తున్న సినీనటి షాలూ చౌరాసియాపై కొమ్ము బాబు అనే వ్యక్తి అసభ్యంగా ప్రవర్తించి సెల్‌ఫోన్‌తో పరారయ్యాడు. ఆ తర్వాత మరో ఘటనలోనూ మరో నిందితుడు వాకర్‌ పట్ల అసభ్యంగా ప్రవర్తించాడు. నిందితుడి కోసం ఎంత గాలించినా ఆధారాలు లభించలేదు. ఈ ప్రాంతాల్లో సీసీ కెమెరాలు ఉంటే నిందితుడి జాడ క్షణాల్లో తెలిసి ఉండేది. సీసీ కెమెరాలు అక్కడ లేకపోవడంతో పరిస్థితి చేయిదాటిపోయింది.  

► నాలుగేళ్ల క్రితం కేబీఆర్‌ పార్కులో నాటకారి నరసింహ అనే చైన్‌స్నాచర్‌ వాకింగ్‌ వచ్చిన మహిళల గొలుసులు తస్కరిస్తూ గోడ దూకి వాక్‌వే నుంచి పరారయ్యేవాడు. ఇలా అయిదుసార్లు స్నాచింగ్‌లకు పాల్పడి పోలీసులను ముప్పుతిప్పలు పెట్టాడు. సీసీ కెమెరాలు లేకపోవడంతో నిందితు డిని పట్టుకోవడానికి పోలీసులకు కష్టతరమైంది.  

► ఓ సూడో పోలీస్‌ ఈ ఏడాది జనవరిలో ఓ ప్రేమ జంటను జీహెచ్‌ఎంసీ వాక్‌వేలో బెదిరించి తాను పోలీసునని అడిగినంత ఇవ్వకపోతే ఫొటోలు బయటపెడతానని వారిని బెదిరించారు. తన బైక్‌పై ప్రేమికుడిని కూర్చుండబెట్టుకొని అమీర్‌పేట్‌కు వెళ్లి ఏటీఎంలో రూ.10 వేలు డ్రా చేయించి ఉడాయించాడు. ఆ సూడో పోలీసు గురించి ఆరా తీయగా అక్కడ సీసీ కెమెరా లేకపోవడంతో పోలీసులు పట్టుకోలేకపోయారు.  


.. నిత్యం వేలాది మంది వాకింగ్‌ చేసే కేబీఆర్‌ పార్కు వాక్‌వేలో జరిగిన ఉదంతాలివి. సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని వాకర్లు మూడేళ్లుగా సంబంధిత అధికారులకు ఫిర్యాదు చేస్తున్నా ఈ వ్యవహారం ముందుకు సాగడం లేదు. తాజాగా కేబీఆర్‌ పార్కు జీహెచ్‌ఎంసీ వాక్‌వేలో సీసీ కెమెరాల ఏర్పాటుకు ఒక అడుగు ముందుకు పడింది. వాకర్లకు భద్రతను కల్పిస్తూ అసాంఘిక శక్తులకు, స్నాచర్లకు, ఆకతాయిలకు అడ్డుకట్ట వేసేందుకు సీసీ కెమెరాలు ఒక్కటే మార్గమని భావించిన పోలీసులు పార్కు చుట్టూ 150 కెమెరాలకు శ్రీకారం చుట్టారు. 


► మొదటి విడతగా 70 కెమెరాలు ఇప్పటికే బిగించారు. మొదటి విడతలో బిగించిన 70 కెమెరాలు త్వరలోనే ప్రారంభోత్సవానికి నోచుకోనున్నాయి. ఇక రెండో విడతలో ఇంకో 80 కెమెరాలు ఏర్పాటు కానున్నాయి. మొదటి విడతలో ఏర్పాటు చేసిన 70 సీసీ కెమెరాలు కేబీఆర్‌ పార్కు ప్రధాన గేటు నుంచి అటు జూబ్లీహిల్స్‌ చెక్‌పోస్టు వరకు ఇటు బసవతారకం క్యాన్సర్‌ ఆస్పత్రి వరకు ఏర్పాటు చేశారు. రెండో విడతలో బసవతారకం ఆస్పత్రి నుంచి జానారెడ్డి నివాసం, స్టార్‌బక్స్, సీవీఆర్‌ న్యూస్, బాలకృష్ణ నివాసం మీదుగా మంత్రి డెవలపర్స్‌ జూబ్లీహిల్స్‌ చెక్‌పోస్టు వరకు 80 కెమెరాలు ఫిక్స్‌ చేస్తారు. వీటి ఏర్పాటుతో వాక్‌వే మొత్తం నిఘా నేత్రంలోకి వెళ్తుంది. (క్లిక్‌:  అమ్నేషియా పబ్‌ కేసు.. మరీ ఇంత దారుణామా..?)

జీహెచ్‌ఎంసీ వైఫల్యం...  
కేబీఆర్‌ పార్కు జీహెచ్‌ఎంసీ వాక్‌వేలో వరుస సంఘటనలు జరుగుతున్నా జీహెచ్‌ఎంసీలో మాత్రం చలనం ఉండటం లేదు. పలుచోట్ల గేట్లు విరిగిపోయాయి. మరికొన్ని చోట్ల ఫెన్సింగ్‌ దొంగిలించారు. ఆరు నెలల క్రితం సంఘటన జరిగినప్పుడు జీహెచ్‌ఎంసీ జోనల్‌ కమిషనర్‌ ఈ సమస్యలన్నీ పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. తీరా ఒక్క హామీ నెరవేరలేదు. కనీసం వాక్‌వేలో స్ట్రీట్‌లైట్లు కూడా చాలా చోట్ల వెలగడం లేదు. ఏదైనా ఘటన జరిగితే పోలీసులపైనే భారం పడుతుంది తప్పితే సంబంధిత జీహెచ్‌ఎంసీ అధికారులు మాత్రం తమకేమీ పట్టనట్లు వ్యవహరిస్తున్నారు. (క్లిక్‌: అడుగడుగునా ట్రాఫికర్‌.. నలుదిక్కులా దిగ్బంధనం

మరిన్ని వార్తలు