దుబ్బాక ఎమ్మెల్యే భౌతిక‌కాయానికి కేసీఆర్ నివాళులు

6 Aug, 2020 15:17 IST|Sakshi

సోలిపేట రామలింగారెడ్డి భౌతికకాయానికి నివాళులర్పించిన కేసీఆర్

కాసేపట్లో అధికార లాంఛనాలతో రామలింగారెడ్డి అంత్యక్రియలు

సాక్షి, సిద్దిపేట: దుబ్బాక ఎమ్మెల్యే సోలిపేట రామలింగారెడ్డి ఆకస్మిక మృతితో చిట్టాపూర్ శోకసంద్రంగా మారింది. ఆయ‌న మ‌ర‌ణ‌వార్త తెలుసుకున్న సీఎం కేసీఆర్ నేడు మ‌ధ్యాహ్నం చిట్టాపూర్‌కు చేరుకున్నారు. అనంత‌రం రామ‌లింగారెడ్డి భౌతిక‌కాయానికి నివాళుల‌ర్పిస్తూ క‌న్నీరు పెట్టుకున్నారు. ఆప్త మిత్రుడిని కోల్పోయానంటూ భావోద్వేగానికి లోన‌య్యారు. కేసీఆర్‌తో పాటు మంత్రులు కేటీఆర్, హరీష్ రావు, ఈటల రాజేందర్, ప్రశాంత్ రెడ్డి ఎమ్మెల్యే‌ భౌతిక కాయాన్ని సందర్శించి నివాళులు అర్పించారు. ఉమ్మడి మెదక్ జిల్లా ఎమ్మెల్యేలు పద్మాదేవేందర్ రెడ్డి, మదన్ రెడ్డి, క్రాంతి కిరణ్, భూపాల్ రెడ్డి, ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి స‌హా పలువురు ప్రజా ప్రతినిధులు రామలింగారెడ్డి భౌతిక కాయాన్ని సందర్శించి వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. (దుబ్బాక ఎమ్మెల్యే మృతి పట్ల కేసీఆర్‌ సంతాపం)

బుధ‌వారం అర్ధరాత్రి తుది శ్వాస విడిచిన రామలింగారెడ్డి అంత్యక్రియల‌ను మ‌రికాసేప‌ట్లో చిట్టాపూర్‌లోని ఆయ‌న వ్య‌వ‌సాయ క్షేత్రం వ‌ద్ద‌ అధికారిక లాంఛనాలతో నిర్వ‌హించ‌నున్నారు. ఈ కార్య‌క్ర‌మంలో సీఎం కేసీఆర్  పాల్గొన‌నుండ‌టంతో సిద్దిపేట పోలీస్, రెవెన్యూ యంత్రాంగం అంత్యక్రియల ఏర్పాట్లలో నిమగ్నమై ఉన్నారు. మ‌రోవైపు కరోనా ఉధృతిని సైతం లెక్క చేయకుండా ఆయన అభిమానులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి ఆయనకు నివాళులు అర్పిస్తున్నారు. 1982 నుంచి ఉదయం, వార్త పత్రికల్లో పని చేసిన జర్నలిస్టులు, TUWJ రాష్ట్ర ప్రతినిధులు విరహథ్ అలీ ఎమ్మెల్యే భౌతికకాయాన్ని సందర్శించారు. తమ మధ్య మూడు దశాబ్దాల అనుబంధం ఉందంటూ వారి మ‌ధ్య అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. (టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే కన్నుమూత‌)

మరిన్ని వార్తలు