సీఎంలు ‘ఏమిటీ జనం?’ అని ఆశ్చర్యపోయారు..’శభాష్‌ అజయ్‌’

19 Jan, 2023 08:24 IST|Sakshi

సాక్షి, ఖమ్మం: ‘శభాష్‌ అజయ్‌.. ఆవిర్భావ సభ సక్సెస్‌ చేశారు. ఖమ్మం చరిత్రలోనే ఇలాంటి సభ ఎన్నడూ జరగలేదు. కమ్యూనిస్టు నాయకులు, మిగతా నేతలు అందరూ సభ అద్భుతంగా జరిగిందని చెప్పారు. ఇతర రాష్ట్రాల ముఖ్యమంత్రులు కూడా ‘ఏమిటీ జనం?’ అంటూ ఆశ్చర్యపోయారు..’ అంటూ ముఖ్యమంత్రి కేసీఆర్‌.. రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్‌ను అభినందించారు. సభావేదిక పైనే కాకుండా సభ ముగించుకుని వెళ్లిన తర్వాత కూడా సీఎం ప్రత్యేకంగా మంత్రికి ఫోన్‌ చేసి అభినందనలు తెలిపారు.

హెలి కాప్టర్‌ నుంచి ముఖ్యమంత్రులు దారి పొడవునా ఉన్న జనాన్ని చూసి ‘ఇంతమంది జనమా?’ అంటూ ఆశ్చర్యం వ్యక్తం చేశారని కేసీఆర్‌ చెప్పారు. భవిష్యత్‌ ఉందంటూ కొనియాడారు. ఖమ్మంలో బీఆర్‌ఎస్‌ తొలి సభ ప్రకటన నాటి నుంచి మంత్రి అజయ్‌ సభను విజయవంతం చేసేందుకు సర్వశక్తులొడ్డారు. ఉమ్మడి జిల్లాలోని నియోజకవర్గాల్లో సన్నాహక సమావేశాలు ఏర్పాటు చేసి భారీగా జన సమీకరణకు కసరత్తు చేశారు. అంతేకాకుండా ఒక్క ఖమ్మం నియోజకవర్గం నుంచే వెయ్యి మంది వలంటీర్లను ఏర్పాటు చేసి సభ ఎలాంటి లోటుపాట్లు లేకుండా విజయవంతంగా ముగిసేలా చూశారు. 
చదవండి: భారత జాతి విముక్తి కోసమే బీఆర్‌ఎస్‌!

మరిన్ని వార్తలు