లంచాల్లేకుండా రిజిస్ట్రేషన్లు

14 Dec, 2020 00:54 IST|Sakshi

పారదర్శకంగా వ్యవసాయేతర ఆస్తుల రిజిస్ట్రేషన్లు

విధివిధానాల ఖరారుకు మంత్రివర్గ ఉపసంఘం ఏర్పాటు

ఉన్నత స్థాయి సమీక్షలో ముఖ్యమంత్రి కేసీఆర్‌ 

సాక్షి, హైదరాబాద్‌ : ‘పేదలు సరైన డాక్యుమెంట్లు లేకుండానే ఇండ్లు నిర్మించు కున్నారు. వారికి కరెంటు బిల్లు, ఇంటి పన్ను, నీటి బిల్లులు వస్తున్నాయి. అలాంటి ఆస్తులను అమ్మే, కొనే సందర్భంలో ఇబ్బం దులు తలెత్తుతున్నాయి. వాటిని పరిష్కరిం చడానికి మార్గం కనిపెట్టాలి’ అని ముఖ్య మంత్రి కె.చంద్రశేఖర్‌రావు అధికారులను ఆదేశించారు. వ్యవసాయేతర ఆస్తులు/ భూముల రిజిస్ట్రేషన్లకు అనుసరించాల్సిన విధానంపై ఆదివారం ఆయన ప్రగతి భవన్‌లో ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహిం చారు. అవినీతికి ఆస్కారం లేకుండా, ప్రజలకు లంచాలు ఇచ్చే గతి పట్టకుండా, ఏ అధికారికీ విచక్షణాధికారం లేకుండా, అత్యంత పారదర్శకంగా, సులభంగా ఉండే విధంగా వ్యవసాయేతర ఆస్తుల రిజిస్ట్రేషన్‌ జరగాలని అధికారులను ఆదేశించారు.

దీనికి అవసరమైన విధివిధానాలు, మార్గ దర్శకాలు ఖరారు చేయాలన్నారు. వ్యవసా యేతర ఆస్తులు/భూముల రిజిస్ట్రేషన్‌ కోసం అవలంబించాల్సిన పద్ధతులపై అన్ని వర్గాలతో మాట్లాడి, అవసరమైన సూచనలు ఇవ్వడం కోసం ఆర్‌ అండ్‌ బీ, గృహ నిర్మాణ శాఖల మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి అధ్యక్షతన మంత్రివర్గ ఉప సంఘాన్ని ముఖ్యమంత్రి ఏర్పాటు చేశారు. ఈ కమిటీలో మంత్రులు కె. తారక రామారావు, ఎర్రబెల్లి దయాకర్‌రావు, మహమూద్‌ అలీ, తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌ సభ్యులుగా ఉంటారు. 3,4 రోజులపాటు బిల్డర్లు, రియల్‌ ఎస్టేట్‌  వ్యాపారులు, ఇతర వర్గాలతోసమావేశాలు నిర్వహించి వారి అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకొని అనుసరించాల్సిన వ్యూహం ఖరారు చేయాలని మంత్రివర్గ ఉపసంఘాన్ని సీఎం కేసీఆర్‌ ఆదేశించారు.

ప్రజలకు కొత్త ఇబ్బందులు రావద్దు..
‘వివిధ కారణాల వల్ల 70–80 రోజుల నుంచి రిజిస్ట్రేషన్లు ఆగిపోయి ఇబ్బందులు తలెత్తాయి. ఇంకా జాప్యం కావద్దు. అన్ని సమస్యలు తొలగిపోయి సులభంగా, సౌకర్యవంతంగా రిజిస్ట్రేషన్‌ చేయించుకొనే విధానం రావాలి. హైదరాబాద్‌లో రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారం చాలా వైభవంగా సాగుతోంది. దానికి ఎలాంటి ఇబ్బంది లేకుండా మరింత మెరుగ్గా సాగడానికి వీలుగా వ్యవసాయేతర ఆస్తుల రిజిస్ట్రేషన్‌ ప్రక్రియ ఉండాలి. ప్రజలకు లేనిపోని కొత్త ఇబ్బందులు రావద్దు. రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారులు, బిల్డర్లు, ఇతర వర్గాలను సంప్రదించి వారి అభిప్రాయాలు తీసుకొని మంచి విధానం తీసుకురావాలి. మంత్రివర్గ ఉపసంఘం అందరితో చర్చించాలి. నగరాలు, పట్టణాల్లో ఎలాంటి సమస్యలున్నాయి? గ్రామాల్లో ఎలాంటి పరిస్థితి ఉంది? ప్రస్తుతం ఏమైనా ఇబ్బందులు ఉన్నాయా? వాటిని ఎలా పరిష్కరించాలి? ఇంకా మెరుగైన విధానం తీసుకురావాలంటే ఏమి చేయాలి? తదితర అంశాలపై కూలంకషంగా చర్చించి ప్రభుత్వానికి నివేదిక ఇవ్వాలి’ అని ముఖ్యమంత్రి సూచించారు.

‘ధరణి’పై సీఎం సంతృప్తి..
ధరణి పోర్టల్‌ ద్వారా జరుగుతున్న వ్యవసాయ భూముల రిజిస్ట్రేషన్ల వివరాలను సీఎం కేసీఆర్‌ అధికారులను అడిగి తెలుసుకున్నారు. చిన్నచిన్న సమస్యలను అధిగమిస్తూ వ్యవసాయ భూముల రిజిస్ట్రేషన్‌ చాలా బాగా జరుగుతోందని, రైతులు చాలా సులభంగా, సంతోషంగా రిజిస్ట్రేషన్‌ చేయించుకుంటున్నారని సీఎం సంతృప్తి వ్యక్తం చేశారు. వ్యవసాయేతర భూముల విషయంలోనూ అలాంటి విధానమే రావాలని ఆకాంక్షించారు. కాగా, సీఎం ఆదేశాలతో మంత్రి వేముల ఆధ్వర్యంలో కేబినెట్‌ సబ్‌ కమిటీ ఏర్పాటు చేస్తూ సీఎస్‌ ఉత్తర్వులు జారీ చేశారు. 

హైదరాబాద్‌లో రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారం చాలా వైభవంగా సాగుతోంది. దానికి ఎలాంటి ఇబ్బంది లేకుండా మరింతమెరుగ్గా సాగడానికి వీలుగా వ్యవసాయేతర ఆస్తుల రిజిస్ట్రేషన్‌ ప్రక్రియఉండాలి. ప్రజలకులేని పోని కొత్తఇబ్బందులు రావద్దు.. సీఎం కేసీఆర్‌

ముగిసిన కేసీఆర్‌ ఢిల్లీ పర్యటన
సాక్షి, న్యూఢిల్లీ: సీఎం కేసీఆర్‌ 3రోజుల ఢిల్లీ పర్యటన ముగించుకుని ఆదివారం మధ్యాహ్నం హైదరాబాద్‌ చేరు కున్నారు. గత శుక్రవారం మధ్యాహ్నం ఢిల్లీ చేరుకున్న కేసీఆర్‌.. ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోం మంత్రి అమిత్‌ షాలతో పాటు కేంద్ర జల్‌శక్తి మంత్రి గజేంద్ర సింగ్‌ షెకావత్, పౌర విమానయాన శాఖ మంత్రి హర్దీప్‌సింగ్‌ పురిలతో వేర్వేరుగా భేటీ అయ్యారు. రాష్ట్రానికి సంబంధించిన పలు సమస్యలు, కేంద్రం నుంచి రాష్ట్రానికి రావాల్సిన నిధుల బకాయిలతో పాటు ఇతర రాజకీయ అంశాలపై చర్చించారు.
 

మరిన్ని వార్తలు