మోదీకి తెలిసే బ్యాంకు కుంభకోణాలు జరుగుతున్నాయి: సీఎం కేసీఆర్‌

10 Jul, 2022 19:34 IST|Sakshi

భారత ప్రధాని నరేంద్ర మోదీపై తెలంగాణ సీఎం కేసీఆర్‌.. విరుచుకుపడ్డారు. సీఎం కేసీఆర్‌ మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. మోదీకి తెలిసే బ్యాంకు కుంభకోణాలు జరుగుతున్నాయి. ఈడీలు, సీబీఐలు బ్యాంకు దొంగలను ఎందుకు పట్టుకోవు అని ప్రశ్నించారు. ఒక్క బ్యాంకు దోపిడీదారుడినైనా ఎందుకు తీసుకురాలేదు. దేశంలో అమాయకులపైనే మీ ప్రతాపమా.?. దోపిడీదారులకు మాత్రం లక్షలకోట్లు దోచిపెడుతున్నారు. 12 లక్షల కోట్ల ఎన్‌పీఏల్లో మోదీ వాటా ఎంతో చెప్పాలి.

తెలంగాణలో ఏక్‌నాథ్‌ షిండేలను సృష్టిస్తామని మాట్లాడాతారా. ఏకానాథ్‌ షిండేలను సృష్టాస్తామని బాహాటంగా చెబుతున్నారు ఇలాదే మీ సంస్కారం. బీజేపీ నేతలు ప్రజాస్వామ్య హంతకులు కారా అని ప్రశ్నించారు. అధికారంలో ఎవరూ శాశ్వతంగా ఉండరని బీజేపీ గుర్తుంచుకోవాలి. పార్టీలను భయపెడతారు.. నాయకులను భయపెడతారు.. ఇదేం ప్రభుత్వం..?. ఏ వ్యవస్థపైనా బీజేపీకి గౌరవం లేదు. 

బీజేపీ అధికార ప్రతినిధి నూపుర్‌ శర్మ నోటికొచ్చినట్లు మాట్లాడింది. ఆమె వ్యాఖ్యలను సుప్రీంకోర్టు తీవ్రంగా తప్పుబట్టింది. ఆ న్యాయమూర్తులకు సెల్యూట్‌ చేస్తున్నాను. నూపురు శర్మ వ్యాఖ్యలను తప్పుపడితే సుప్రీంకోర్టుపైనా లేఖలు రాయిస్తారా అని మండిపడ్డారు. సుప్రీంకోర్టు జడ్జీలనే బెదిరిస్తున్నారు.. ఇది కరెక్టేనా..?. సుప్రీంకోర్టును కూడా ఖాతరు చేయని కండకావరమా బీజేపీ..?. జడ్డీలను కూడా ట్రోలింగ్‌ చేస్తారా..?. దేశంలో ఇప్పుడు అప్రకటిత ఎమర్జెన్సీ నడుస్తోంది. కోర్టులు, జర్నలిస్టులు అంటే కేంద్రానికి గౌరవం లేదు. 

మేకిన్‌ ఇండియా పథకం అట్టర్‌ ప్లాప్‌ అయింది. పెట్టుబడిదారుల కోసం పీఎం సెల్స్‌మెన్‌గా మారారు.మన జాతీయ జెండాలు చైనా తయారు చేయడం మేకిన్‌ ఇండియానా..?. పతంగులు, దారాలు కూడా మనం తయారు చేయాలేమా..?. దేశంలో రైతులకు సబ్సిడీ ఇవ్వరు. బీజేపీ నేతలు ప్రజా హంతకులు కారా..?. బీజేపీ కండువా కప్పుకోగానే కొందరు అవినీతికి పాల్పడిన నేతలకు నోటీసులు ఆగిపోయాయి. వారంతా బీజేపీలోకి వెళ్లగానే వారంతా పవిత్రం అయిపోతారా..?. చివరకు దేశ సైన్యం విషయంలో కూడా ఉన్మాదంతో ప్రవర్తిస్తారా..?. మీ వికృత రాజకీయాల కోసం కశ్మీర్‌ పండిట్లను బలి తీసుకుంటారా..? అని ప్రశ్నల వర్షం కురిపించారు. 

ఇది కూడా చదవండి: మీకు అది కూడా చేతకాదా మోదీ జీ.. కేసీఆర్‌ షాకింగ్‌ వ్యాఖ్యలు

మరిన్ని వార్తలు