సీఎం దళిత్ ఎంపవర్‌మెంట్‌కు రూ.వెయ్యి కోట్లు కేటాయిస్తాం: కేసీఆర్

27 Jun, 2021 18:32 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: సామాజికంగా, ఆర్ధికంగా దళితులు అభివృద్ధి చెందాలని ముఖ్యమంత్రి కే. చంద్రశేఖరరావు అన్నారు. ఆదివారం ప్రగతిభవన్‌లో అఖిలపక్షం సమావేశమైంది. ఈ కార్యక్రమంలో 'సీఎం దళిత్ ఎంపవర్‌మెంట్‌' పథకం విధివిధానాలపై చర్చించారు. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్‌ మాట్లాడుతూ.. '' సామాజికంగా, ఆర్ధికంగా దళితులు అభివృద్ధి చెందాలి. ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తే రేపటి తరాలు నష్టపోతాయి. దళితుల అభ్యున్నతి కోసం దశలవారీగా కార్యాచరణ చేపడతాం. దళితుల్లో అర్హులైన కుటుంబాల గణన జరపాలి. అట్టడుగున ఉన్న వారి నుంచి సహాయం ప్రారంభించి.. వారి అభ్యున్నతిని సాంకేతిక విధానం ద్వారా పర్యవేక్షించాలి. ఈ బడ్జెట్‌లో సీఎం దళిత్ ఎంపవర్‌మెంట్‌కు రూ.వెయ్యి కోట్లు కేటాయిస్తాం. మరో రూ.500 కోట్లు పెంచేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉంది. వచ్చే నాలుగేళ్లలో రూ.40 వేల కోట్లు ఖర్చు చేయాలని ప్రభుత్వం యోచిస్తోంది.

సీఎం దళిత్ ఎంపవర్‌మెంట్‌ విజయవంతం చేయాలనేదే నా సంకల్పం. దళితుల అభ్యున్నతి కోసం అఖిలపక్షం సూచనలు ఇవ్వాలి.దళిత సాధికారతకు పైరవీలకు ఆస్కారం లేని విధానం.రాజకీయాలకతీతంగా సమిష్టి కార్యాచరణ బాధ్యత తీసుకుందాం. గ్రామీణ, పట్టణ దళితుల సమస్యలను గుర్తించి పరిష్కారాలు వెతకాలి. దళిత సాధికారతకు పైరవీలకు ఆస్కారం లేని విధానం రైతుబంధు పథకం, ఆసర పెన్షన్ల మాదిరిగా.. నేరుగా దళితులకు ఆర్థికసాయం అందేలా సూచనలు ఇవ్వాలి'' అని కేసీఆర్‌ తెలిపారు.

కశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు ఎక్కడికి వెళ్లినా సామాజికంగా, ఆర్థికంగా పీడిత వార్గాలు ఎవరంటే చెప్పే పేరు దళితులు, అందుకే ఈ బాధలు పోవాలన్నారు. తాము కూడా పురోగమించగలం అనే ఆత్మ స్థైర్యంతో దళిత సమాజం ముందుకు పోవడానికి తెలంగాణ ప్రభుత్వం ఏమి చేయాలో తగిన సూచనలు ఇవ్వాలని సీఎం కేసీఆర్‌ అఖిలపక్ష నాయకులను కోరారు. ఈ కార్యక్రమానికి కాంగ్రెస్ నేత భట్టి‌, ఎంఐఎం ఎమ్మెల్యే పాషా ఖాద్రి, సీపీఐ నేత చాడ వెంకట్‌రెడ్డి, సీపీఎం నేత తమ్మినేని వీరభద్రం హాజరయ్యారు. అఖిలపక్ష సమావేశానికి దూరంగా ఉండాలని బీజేపీ నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. అయితే బీజేపీ ఆదేశాలు పట్టించుకోకుండా మోత్కుపల్లి నర్సింహులు పాల్గొన్నారు. బీజేపీ ఆఫీస్‌లో దళిత నేతల భేటీకి డుమ్మా కొట్టిన మోత్కుపల్లి వ్యవహారంపై బీజేపీ సీరియస్‌గా ఉంది. 
చదవండి: మరియమ్మ కుమారుడికి డీజీపీ మహేందర్‌రెడ్డి పరామర్శ

మరిన్ని వార్తలు