ఆ లంచం కేసుతో నాకు సంబంధం లేదు 

5 Sep, 2020 01:50 IST|Sakshi

మేడ్చల్‌ జిల్లా కలెక్టర్‌ వాసం వెంకటేశ్వర్లు

సాక్షి, మేడ్చల్‌ జిల్లా: కీసర తహసీల్దార్‌ రూ.1.10 కోట్ల లంచం తీసుకున్న వ్యవహారంతో తనకు ఎలాంటి సంబంధం లేదని మేడ్చల్‌–మల్కాజిగిరి జిల్లా కలెక్టర్‌ వాసం వెంకటేశ్వర్లు స్పష్టం చేశారు. తనపై జరుగుతున్న తప్పుడు ప్రచారాన్ని సహించేది లేదన్నారు. కీసర తహసీల్దార్‌ విచారణ సమయంలో తనపై తప్పుడు ప్రచారం కొనసాగటంపై తీవ్రంగా స్పందించారు. శుక్రవారం ‘సాక్షి’తో ఆయన మాట్లాడుతూ.. ‘మ్యుటేషన్‌ ప్రక్రియ తహసీల్దార్‌ పరిధిలోనే ఉంటుంది. కలెక్టర్‌ వద్దకు కనీసం ఫైలు కూడా రాదు.. ఈ కేసులో నా పాత్ర ఉందనే ఆరోపణలు మానుకోవాలి. లేదంటే చట్టపరమైన చర్యలు తీసుకుంటాం. అవసరమైతే న్యాయపరమైన చర్యలకు వెళ్లాల్సి వస్తుంది. ఎవరైనా కొత్త వ్యక్తులు సమస్యల తో వచ్చినప్పుడు విచారణ చేసి, నిబంధనల ప్రకారముంటేనే వాటిని పరిష్క రించాలని చెబుతాను. రోజూ విజిటింగ్‌ సమయంలో కలసిన ప్రతి ఆర్జీదారుకు సంబంధించిన విషయాలను సంబంధిత అధికారులకు తెలియజేస్తాం. ఆ అధి కారులూ నిబంధనల ప్రకారమే నడుచుకోవాల్సి ఉంటుంది’అని అన్నారు. 

మరిన్ని వార్తలు