స్కూల్‌కు ఆలస్యంగా వెళ్తే పీఈటీ కొడతారనే భయం.. సైకిల్‌పై 65 కిలోమీటర్లు వెళ్లి

13 Oct, 2022 14:59 IST|Sakshi

సాక్షి, వరంగల్‌, ఖమ్మం: పాఠశాలకు ఆలస్యంగా వెళ్తే పీఈటీ కొడతారనే భయంతో సైకిల్‌పై 65 కిలోమీటర్లు ప్రయాణించిన ఒక బాలుడిని పోలీసులు తిరిగి తల్లిదండ్రులకు అప్పగించారు. మహబూబాబాద్‌ జిల్లా తొర్రూరు మండలంలో బుధవారం రాత్రి జరిగిన ఈ సంఘటనపై ఎస్‌ఐ గండ్రాతి సతీష్‌ తెలిపిన వివరాలివి. ఖమ్మానికి చెందిన 12 ఏళ్ల కుషాల్‌ రాజా అదే ప్రాంతంలోని వండర్‌ కిడ్స్‌ పాఠశాలలో 7వ తరగతి చదువుతున్నాడు. రోజూ సైకిల్‌పై పాఠశాలకు వెళ్లే రాజా బుధవారం ఆలస్యం అయ్యాడు.

దీంతో పీఈటీ దండిస్తారని భయపడి పాఠశాలకు వెళ్లకుండా ఖమ్మం నుంచి సైకిల్‌ తొక్కుతూ 65 కిలోమీటర్లు ప్రయాణించి తొర్రూరు మండలం మాటేడుకు బుధవారం రాత్రి చేరుకున్నాడు. చీకట్లో ఎటు వెళ్లాలో తెలియక ఏడుస్తున్న బాలుడిని చూసి స్థానికులు డయల్‌ 100 ద్వారా పోలీసులకు సమాచారమిచ్చారు. కానిస్టేబుల్‌ రాజు బాలుడి తల్లిదండ్రుల వివరాలు తెలుసుకుని వారికి సమాచారం అందించారు. అనంతరం పోలీస్‌ స్టేషన్‌లో ఎస్‌ఐ సతీష్‌ బాలుడికి కౌన్సెలింగ్‌ చేసి అల్పాహారం పెట్టి తల్లిదండ్రులకు అప్పగించారు. 

మరిన్ని వార్తలు