కరోనా సోకిన మావోయిస్టులకు ఫ్రీగా వైద్యం: పోలీసులు

9 May, 2021 11:53 IST|Sakshi

సాక్షి, ఖమ్మం: ఇప్పుడిప్పుడే తిరిగి ఉనికి చాటుకోవాలనుకుంటున్న మావోయిస్టులపై సైతం కరోనా ఎఫెక్ట్‌ పడుతోంది. ప్రస్తుతం కోవిడ్‌ పరిస్థితులు మావోలకు ఇబ్బందికరంగా మారినట్లు తెలుస్తోంది. మావోల్లో కొందరు కరోనా బారినపడి ఉక్కిరిబిక్కిరి అవుతున్నట్లు పోలీస్ వర్గాలకు సమాచారం అందుతోంది. మెరుగైన వైద్యం కోసం వారు ఎదురు చూస్తున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో మావోయిస్టుల రాక కొసం పోలీసులు ప్రయత్నాలు మొదలు పెట్టారు. పార్టీని వీడి వస్తే వైద్య సదుపాయం అందించడంతో పాటు ఆర్ధికంగా కూడా అండగా ఉంటామని భరోసా ఇచ్చే విధంగా హామీ ఇస్తున్నారు.

ఛత్తీస్‌గఢ్‌లోని బస్తర్ రీజన్ పరిధిలో దంతేవాడ, బీజాపూర్, సుక్మా జిల్లాలో సుమారు 70 నుంచి100 మంది వరకు మావోయిస్టులకు కరోనా సోకినట్లు సమాచారం. ఈ విషయాన్ని పోలీస్ వర్గాలు కూడా దృవీకరిస్తున్నాయి. కరోనా పాటు ఇతర అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నట్లు తెలుస్తుంది. వీరిలో మోస్ట్ వాంటెడ్ మహిళ మావోయిస్టు సుజాత (25లక్షల రూపాయల రివార్డ్),తో పాటు 10 లక్షల రూపాయల రివార్డులు కలిగిన మావోయిస్టులు జయలాల్, దినేష్‌లు ఉన్నట్లు సమాచారం.

కోవిడ్‌తో బాధపడుతున్న మావోలు జనజీవన స్రవంతిలోకి వచ్చినట్లయితే వారందరికీ ప్రభుత్వం తరపున మంచి వైద్యం అందిస్తామని దంతేవాడ ఏస్పీ అభిషేక్ పల్లవ్ హామీ ఇచ్చారు. మరోవైపు మావోయిస్టుల్లో కొందరు కోవిడ్‌ బారినపడి ప్రాణాలు కోల్పోయినట్టుగా తెలుస్తోంది. మృతుల అంత్యక్రియలకు సంబంధించిన దృశ్యాలు కొని​ సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారాయి.

కరోనా వైరస్ బారిన పడుతున్న మావోయిస్ట్ పార్టీలోని కొంతమంది నాయకులు, దళ సభ్యులు కూడా ఉన్నట్లు తమకు సమాచారం అందిందని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఎస్పీ సునీల్‌ దత్‌ చెప్పారు. వీరిలో కొంతమంది వివిధ రకాల ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్నట్లు తెలుస్తుందని, ఇందులో అగ్ర నాయకులు కూడా ఉన్నరన్నారు. కరోనా కారణంగా ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్న మావోయిస్టు పార్టీ నాయకులు ఎవరైనా వైద్య సదుపాయాలు కావాలనుకుంటే పార్టీ విడి రావాలని సూచిస్తున్నారు. పోలీసువారి సహాయం తీసుకొని చికిత్స చేయించుకొవాలన్నారు.

చదవండి: సంచలనం సృష్టించిన పుట్ట మధు అదృశ్యం కేసు

మరిన్ని వార్తలు