సాక్షి, ఖమ్మం : బందోబస్తు విధులు నిర్వర్తిస్తున్న ఓ మహిళా కానిస్టేబుల్పై టీఆర్ఎస్ కార్యకర్త దాడి చేసిన ఘటన శుక్రవారం కేటీఆర్ పర్యటన సందర్భంగా చోటుచేసుకుంది. టీఆర్ఎస్ కార్యాలయం వద్ద భూపాలపల్లి జిల్లాకు చెందిన డీఎస్పీ సంపత్కుమార్ ఆధ్వర్యంలో పోలీస్ సిబ్బంది బందోబస్తు నిర్వహిస్తున్నారు. కేటీఆర్ కార్యాలయం చేరుకొనే సమయంలో పోలీసులు ఎవరినీ లోపలికి అనుమతించలేదు.
దీంతో ఆగ్రహాంతో అక్కడ ఉన్న టీఆర్ఎస్ కార్యకర్తల్లో ఒకరైన ఫ్రాన్సిస్.. మహిళా కానిస్టేబుల్ జ్యోత్స్నపై పుష్పగుచ్ఛంతో దాడి చేశాడు. దీంతో పుష్పగుచ్ఛం వెనుకవైపు ఉన్న కర్ర కానిస్టేబుల్ తలకు బలంగా తగలడంతో బిగ్గరగా రోదించింది. అక్కడే ఉన్న డీఎస్పీ సంపత్కుమార్ వెంటనే అతడిని అదుపులోకి తీసుకోవాలని ఆదేశాలు జారీచేయటంతో టూటౌన్ సీఐ గోపి అతడిని అదుపులోకి తీసుకొని పోలీస్ స్టేషన్కు తరలించారు.