టీఆర్‌ఎస్‌ నాయకుల డిష్యుం.. డిష్యుం

18 Mar, 2021 08:39 IST|Sakshi
గాయపడిన జాల సాంబ

ఉసిరికాయలపల్లిలో గ్రామశాఖ

అధ్యక్షుడిపై కత్తులతో దాడి

ఎమ్మెల్సీ డబ్బుల పంపిణీలో విభేదాలు

సాక్షి, ఖమ్మం : ఉసిరికాయలపల్లి టీఆర్‌ఎస్‌ గ్రామ శాఖ అధ్యక్షుడు జాల సాంబపై అదేపార్టీకి చెందిన వారు కత్తులతో దాడి చేసి హత్యాయత్నానికి పాల్పడిన ఘటన బుధవారం చోటు చేసుకుంది. స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..సాంబకు ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించిన గ్రాడ్యుయేషన్‌ ఓట్లకు రూ.36వేలు పార్టీ అధిష్టానం ఇచ్చిందని, ఈ మొత్తాన్ని పంపిణీ చేయలేదని అదే గ్రామానికి చెందిన టీఆర్‌ఎస్‌ మరో వర్గ నాయకుడు పచ్చిపాల వెంకట్‌ వాట్సాప్‌ గ్రూపులో ఆరోపిస్తూ పోస్టు చేశాడు. దీనికి సాంబ సైతం ఘాటుగా సమాధానం ఇచ్చాడు. ఆ తర్వాత ఇష్టానుసారంగా పోస్టులు చేసుకున్నారు.

ఈ క్రమంలో జాల సాంబ అదే గ్రామంలో పొడుగు సర్వయ్య అనే వ్యక్తికి ఆరోగ్యం బాగాలేక పోవడంతో పరామర్శించేందుకు వెళ్లగా, అప్పటికే కోపోద్రిక్తుడైన పచ్చిపాల వెంకట్‌తో పాటు, మరో ముగ్గురు వ్యక్తులు వెంట తెచ్చుకున్న కత్తితో దాడి చేసి గాయపరిచారు. గమనించిన స్థానికులు కేకలు వేయడంతో పారిపోయారు. ఏఎస్‌ఐ నాగరాజు సంఘటనా స్థలానికి చేరుకొని వివరాలు సేకరించారు. గాయపడిన జాల సాంబాను 108 అంబులెన్స్‌లో ఖమ్మం ఆస్పత్రికి తరలించి చికిత్స నిర్వహిస్తున్నారు. వాట్సాప్‌ గ్రూపు అడ్మిన్లు కఠినంగా వ్యవహరించక, పోలీసులు దృష్టి సారించక..చిలికిచిలికి ఘర్షణకు దారితీస్తోందనే విమర్శలొస్తున్నాయి.

చదవండి: ఎమ్మెల్సీ ఫలితాలు: ఏం జరుగుతుందో?

మరిన్ని వార్తలు