కరోనా విజృంభణ..భయాందోళనలో గ్రామస్తులు

29 May, 2021 15:08 IST|Sakshi

ఖమ్మం జిల్లా ముత్యాలగూడెంలో జనం ఆందోళన

10 రోజుల వ్యవధిలో ముగ్గురు మృతి  

కారేపల్లి: ఖమ్మం జిల్లా కారేపల్లి మండలం ముత్యాలగూడెం గ్రామంలో కరోనా కలకలం సృష్టిస్తోంది. కేవలం 10 రోజుల వ్యవధిలోనే ముగ్గురు వ్యక్తులు మృత్యువాత పడడంతో గ్రామస్తులు భయాందోళన చెందుతున్నారు. ఇప్పటి వరకు సుమారు 100 పాజిటివ్‌ కేసులు నమోదు కావడంతో.. 250 జనాభాగల ఆదివాసీ గ్రామం వణికిపోతోంది. ఈ నెల 26వ తేదీన ఈసం భద్రయ్య, కోరం ఎల్లయ్యలు కరోనాతో చనిపోవడం అంతకుముందు కోరం రాయుడు అనే వ్యక్తి సైతం కరోనాతో మృత్యువాత పడడంతో ముత్యాలగూడెం ప్రజలు ఆందోళన చెందుతున్నారు.

ఈ నెల 6, 14వ తేదీల్లో జరిగిన వివాహ వేడుకలే..గ్రామంలో కరోనా వ్యాప్తికి కారణమని, ఎక్కువ సంఖ్యలో జనం హాజరై విందు భోజనాలు చేశారని, మాస్కులు లేకుండా కలివిడిగా తిరిగారని స్థానికులు కొందరు వాపోతున్నారు. 10 రోజుల వ్యవధిలోనే గ్రామంలో 70 కరోనా కేసులు నమోదు కావడం, ముగ్గురు చనిపోవడంతో ఒక్కసారిగా అధికార యంత్రాంగం కూడా ఉలిక్కిపడింది. కొడుకు పెళ్లి చేసిన ఈసం భద్రయ్య కరోనా సోకి చనిపోవడం ఆ కుటుంబంలో తీవ్ర విషాదాన్ని నింపింది. తహసీల్దార్‌ డి.పుల్లయ్య, కారేపల్లి ఎస్‌ఐ పి.సురేశ్, వైద్య సిబ్బంది, కరోనా బాధితుల కుటుంబాలకు మందులు అందజేశారు. కరోనా బాధితుల్లో మరికొందరిని గాంధీనగర్‌ ఐసోలేషన్‌ కేంద్రానికి తరలించారు.

(చదవండి: అంబులెన్స్‌ ధరలు.. మోటారుసైకిల్‌పై మృతదేహం తరలింపు)

మరిన్ని వార్తలు