అన్నంలో పురుగు మందు కలుపుకొని తిని..

18 Jul, 2022 08:19 IST|Sakshi
విషమంగా పిల్లల పరిస్థితి (భానుశ్రీ, శ్రీవిద్య)

కారేపల్లి: కూలి పనులు చేస్తే వచ్చే డబ్బు అంతంతే కావడం.. దానికితోడు భర్త మద్యానికి బానిసయ్యాడని మనస్తాపం చెందిన ఓ మహిళ తన ఇద్దరు కుమార్తెలకు అన్నంలో పురుగు మందు కలిపి పెట్టి, తాను తిని ఆత్మహత్యాయత్నానికి ఒడిగట్టింది. ఖమ్మం జిల్లా కారేపల్లి మండలం చిన్నకట్టుగూడెంలో ఆదివారం ఈ ఘటన చోటు చేసుకుంది. స్థానికుల కథనం ప్రకారం.. చిన్నకట్టుగూడెం గ్రామానికి చెందిన బానోతు శివ, ఉమ భార్యాభర్తలు. వీరికి ఐదో తరగతి చదివే భానుశ్రీ, నాలుగో తరగతి చదివే శ్రీవిద్య అనే కూతుళ్లు ఉన్నారు. కూలి చేసుకుని జీవించే వీరి కుటుంబంలో మద్యం చిచ్చుపెట్టింది. 

ఇటీవల శివ మద్యానికి బానిస కావడంతో ఉమ అతనిని వారిస్తోంది. అయితే, శివ శనివారం రాత్రి కూడా మద్యం తాగి రావడంతో ఉమ మనస్తాపానికి గురైంది. ఈ క్రమంలో ఆదివారం ఉదయం శివ పనికి వెళ్లాక అన్నంలో పురుగు మందు కలిపి కూతుళ్లకు పెట్టాక ఆమె కూడా తిని ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. అనంతరం గోవింద్‌తండా గ్రామంలోని తన తండ్రికి ఫోన్‌ చేసి ఈ విషయాన్ని చెప్పింది. సమాచారం తెలుసుకున్న స్థానికులు వారిని కారేపల్లి పీహెచ్‌సీకి తరలించారు. అక్కడ ప్రాథమిక చికిత్స అనంతరం ఖమ్మం ప్రభుత్వ ఆస్పత్రికి తీసుకెళ్లారు. అయితే, ఉమ, ఇద్దరు పిల్లల పరిస్థితి విషమంగా ఉండటంతో హైదరాబాద్‌ తరలించారు.

ఇదీ చూడండి: మాకు న్యాయం చేయాలి

మరిన్ని వార్తలు