ఖానామెట్‌ భూముల వేలం.. రూ.729.41 కోట్ల ఆదాయం

16 Jul, 2021 18:57 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : ఖానామెట్‌ భూముల ఈ-ఆక్షన్‌ ముగిసింది. ఖానామెట్‌లోని 15 ఎకరాల్లో 5 ప్లాట్లకు వేలం జరిగింది. భూముల విక్రయంతో రూ.729.41 కోట్ల ఆదాయం వచ్చింది. ఖానామెట్‌లో ఎకరం భూమి ధర అత్యధికంగా రూ.55 కోట్లు పలికింది. మంజీరా కన్‌స్ట్రక్షన్స్‌ రూ.160.60 కోట్లతో 2.92 ఎకరాలు.. జీవీపీఆర్‌ ఇంజినీర్స్‌ లిమిటెడ్‌ రూ.185.98 కోట్లతో 3.69 ఎకరాలు.. లింక్‌వెల్‌ టెలీసిస్టమ్స్‌ రూ.153.09 కోట్లతో 3.15 ఎకరాలు.. అప్‌టౌన్‌ లైఫ్‌ ప్రాజెక్ట్స్‌ రూ.137.34 కోట్లతో 3.15 ఎకరాలు కొనుగోలు చేశాయి. రూ.92.40 కోట్లతో మరో 2 ఎకరాలను లింక్‌వెల్‌ టెలీసిస్టమ్స్‌  కొనుగోలు చేసింది. 

కాగా, కోకాపేట భూములకు హెచ్‌ఎండీఏ గురువారం కేంద్ర ప్రభుత్వ సంస్థ ఎంఎస్‌టీసీ వేదికగా ఈ–వేలం నిర్వహించింది. ఇందులో ఏడు ప్లాట్లు నియోపోలీస్‌ లేఅవుట్‌వి కాగా ఒక ప్లాట్‌ గోల్డెన్‌ మైల్‌ ప్రాజెక్టుకు సంబంధించినది. ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు 30.778 ఎకరాలతో కూడిన 4 ప్లాట్లు, మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు మిగిలిన 19.171 ఎకరాల 4 ప్లాట్లకు వేలం జరిగింది.

గోల్డెన్‌ మైల్‌ ప్రాజెక్టుకు చెందిన ‘2/పీ వెస్ట్‌ పార్ట్‌’ ప్లాట్‌ నంబర్‌లో 1.65 ఎకరాలుండగా, ఎకరానికి రూ.60.2 కోట్ల గరిష్ట బిడ్డింగ్‌ ధరను కోట్‌ చేసి, మొత్తం రూ.99.33 కోట్ల ధరతో ‘రాజపుష్ప రియాల్టీ ఎల్‌ఎల్‌పీ’ అనే స్థిరాస్తి వ్యాపార సంస్థ ఆ ప్లాట్‌ను దక్కించుకుంది. గోల్డెన్‌ మైల్‌ ప్రాజెక్టు పేరుతో 2007లో నాటి ప్రభుత్వం కోకాపేటలోని ప్రభుత్వ భూములకు వేలం నిర్వహించగా, అప్పట్లో మిగిలిపోయిన ఈ ప్లాట్‌కు తాజాగా నిర్వహించిన వేలంలో రికార్డు ధర పలకడం గమనార్హం. వేలంలో ఎకరాకు రూ.31.2 కోట్ల అతి తక్కువ బిడ్డింగ్‌ ధరతో ప్లాట్‌ నంబర్‌–‘ఏ’ లోని ఎకరం భూమిని హైమ డెవలపర్స్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ దక్కించుకుంది. కనీస బిడ్డింగ్‌ ఇంక్రిమెంట్‌ ధర ఎకరానికి రూ.20 లక్షల లెక్కన బిడ్డర్లు భూముల ధరలు పెంచుతూ పోయారు.

మరిన్ని వార్తలు