ప్రజలు రోడ్డు మీదకు రావద్దు : కిషన్‌రెడ్డి

14 Oct, 2020 12:11 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : అవసరమైతే తప్ప ప్రజలు రోడ్డు మీదకు రావొద్దని, వాహనాలను బయటకు తీసుకురావొద్దని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్‌రెడ్డి కోరారు. గత 3 రోజులుగా ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో వర్షాలు ఊహించని స్థాయిలో పడ్డాయని, వరదల కారణంగా చాలా మంది గల్లంతయ్యారని, అనేక ఇబ్బందులు పడుతున్నారని చెప్పారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ‘‘ వాతావరణ శాఖ కూడా ముందునుంచి హెచ్చరికలు జారీ చేస్తూ వచ్చింది. హైదరాబాద్ నగరంలో అత్యధిక వర్షపాతం నమోదయింది. స్థానిక ప్రభుత్వ యంత్రాంగంతో స్వయంగా మాట్లాడాను. సాధ్యమైనంత వరకు నష్ట నివారణ చర్యలు చేపట్టాలని, సహాయ పునరావాస ఏర్పాట్లు చేయాలని సూచించాను. ఎన్డీఆర్‌ఎఫ్‌ బృందాన్ని నిన్ననే రాష్ట్ర ప్రభుత్వానికి అందుబాటులో పెట్టాము. (అధికారులంతా అప్రమత్తంగా ఉండండి )

మరో రెండు ఎన్డీఆర్‌ఎఫ్‌ బృందాలు బయటి రాష్ట్రాల నుంచి హైదరాబాద్ చేరుకున్నాయి. బీజేపీ నాయకత్వం, శ్రేణులతో మాట్లాడి నిర్వాసితులకు భోజనం అందించడం సహా ఇతర సహాయక కార్యక్రమాల్లో పాల్గొనాలని కోరాను. బీజేపీ శ్రేణులు విస్తృతంగా సహాయక కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. యువత కూడా అధికార యంత్రాంగంపై ఆధారపడకుండా సహాయక కార్యక్రమాల్లో పాల్గొనాలని పిలుపునిస్తున్నా’’నన్నారు.

మరిన్ని వార్తలు