పర్యాటకానికి తలమానికం భారత్‌ గౌరవ్‌ రైళ్లు 

30 Apr, 2023 03:13 IST|Sakshi

కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి 

‘గంగా పుష్కరాల’ భారత్‌ గౌరవ్‌ రైలును ప్రారంభించిన మంత్రి  

అడ్డగుట్ట (హైదరాబాద్‌): భారత్‌ గౌరవ్‌ రైళ్లు దేశంలో పర్యాటక రంగానికి తలమానికంగా నిలుస్తున్నాయని కేంద్ర పర్యాటక శాఖ మంత్రి జి.కిషన్‌రెడ్డి అన్నారు. శనివారం ఆయన సికింద్రాబాద్‌ రైల్వే స్టేషన్‌లోని 10వ ప్లాట్‌ఫాంలో ‘గంగా పుష్కరాల యాత్ర’(పూరీ, కాశీ, అయోధ్య) భారత్‌ గౌరవ్‌ ప ర్యాటక రైలును దక్షిణ మధ్య రైల్వే జీఎం అరుణ్‌ కుమార్‌ జై న్, సికింద్రాబాద్‌ డీఆర్‌ఎం అభయ్‌ గుప్తా, ఐఆర్‌సీటీసీ జీజీ ఎం రాజ్‌కుమార్‌లతో కలసి జెండా ఊపి ప్రారంభించారు.

ఈ సందర్భంగా కిషన్‌రెడ్డి మాట్లాడుతూ దేశ సాంస్కృతిక వారసత్వాన్ని, చారిత్రక ప్రదేశాలను, పుణ్య క్షేత్రాలను యా త్రికులు దర్శించడానికి రైల్వే శాఖ 3వ భారత్‌ గౌరవ్‌ రైలును ప్రారంభించిందన్నారు. శనివారం బయలుదేరిన భారత్‌ గౌ రవ్‌ రైలు కోణార్క సూర్య దేవాలయం, పూరీ, కాశీ, అయో ధ్య తదితర పుణ్యక్షేత్రాల సందర్శన తర్వాత మే 7న తిరిగి సికింద్రాబాద్‌కు చేరుకుంటుందని తెలిపారు. ఈ మార్గంలోని వివిధ పుణ్య క్షేత్రాలకు భక్తులను తీసుకెళ్లి అక్కడ స్థానికంగా అవసరమయ్యే రవాణా, భోజన, వసతి సౌకర్యాలన్నీ భారతీయ రైల్వేనే ఏర్పాటు చేస్తుందన్నారు.

వృద్ధులు, మహిళలు, పిల్లలను వెంట తీసుకొని ఈ పుణ్యక్షేత్రాల సందర్శనకు వెళ్లాలంటే ప్రజలకు భారీ ఖర్చు, ప్రయాసలతో కూడిన పని కాబట్టి మోదీ ప్రభుత్వం గౌరవ్‌ రైళ్లకు శ్రీకారం చుట్టిందన్నారు. కాగా, జూన్‌ 10న సికింద్రాబాద్‌ నుంచి జమ్మూలో ని మాతా వైష్ణోదేవి, హరిద్వార్, రిషికేశ్‌ తదితర ప్రాంతాల సందర్శనకు మరో భారత్‌ గౌరవ్‌ రైలును ప్రారంభించనున్నట్టు ఆయన తెలిపారు. రైల్వే జీఎం అరుణ్‌ కుమార్‌ జైన్‌ మాట్లాడుతూ యాత్రికులకు ఇబ్బందులు లే కుండా సాంస్కృతికంగా ప్రముఖమైన ప్రదేశాలను సందర్శించడానికి ఒక ప్రత్యేకమైన అవకాశాన్ని అందిస్తున్నామన్నారు.  

యాత్రికులకు అల్పాహార ప్యాకెట్లు అందజేసిన మంత్రి 
భారత్‌ గౌరవ్‌ రైలు యాత్రలో భాగంగా యాత్రికులకు కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి అల్పాహార ప్యాకెట్లను అందజేశారు. అనంతరం వారితో కొద్దిసేపు ముచ్చటించారు. భారత్‌ గౌరవ్‌ రైలు ద్వారా పుణ్యక్షేత్రాల సందర్శన సులభం అయిందంటూ యాత్రికులు ఆనందం వ్యక్తం చేస్తున్నారని కిషన్‌రెడ్డి పేర్కొన్నారు. 

మరిన్ని వార్తలు