సత్తన్న ఇంటికి ‘కోమటిరెడ్డి’

2 Feb, 2023 08:02 IST|Sakshi

నిర్మల్‌: ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లా జెడ్పీ మాజీచైర్మన్‌ శోభారాణి, బీఆర్‌ఎస్‌ రాష్ట్రనేత సత్యనారాయణగౌడ్‌ దంపతులను మునుగోడు మాజీ ఎమ్మెల్యే, బీజేపీ నేత కోమటిరెడ్డి రాజ్‌గోపాల్‌రెడ్డి కలిశారు. బుధవారం రాత్రి జిల్లా కేంద్రంలోని సత్తన్న ఇంటికి వెళ్లి ఇటీవల కిడ్నీలో రాళ్లకు సంబంధించిన శస్త్రచికిత్స చేయించుకున్న సత్యనారాయణగౌడ్‌ను పరామర్శించారు. ఆయన వెంట బీజేపీ ముధోల్‌ నియోజకవర్గ నేత రామారావుపటేల్, తదితరులు ఉన్నారు.

రాజకీయమేమీ లేదు..
ఉద్యమ సమయంలో సీఎం కేసీఆర్‌తో కలిసి పనిచేసిన నేతగా గుర్తింపు ఉన్న సత్యనారాయణగౌడ్‌ ఇంటికి రాజ్‌గోపాల్‌రెడ్డి రావడం రాజకీయంగా చర్చనీయాంశంగా మారింది. కొంతకాలంగా మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి, బీఆర్‌ఎస్‌తో అంటీముట్టనట్టుగా ఉంటున్న సత్తన్న బీజేపీలో చేరుతారా..? ఆదిలాబాద్‌ పార్లమెంట్‌ను దత్తత తీసుకుంటానని పలుమార్లు ప్రకటించిన కోమటిరెడ్డి అదే విషయంలో ఈయన ఇంటికి వచ్చారా..? అనే ఊహాగానాలు మొదలయ్యాయి. వీటిపై ‘సాక్షి’వివరణ కోరగా సత్యనారాయణగౌడ్‌ కొట్టిపారేశారు. రాజ్‌గోపాల్‌రెడ్డి బంధువు తనకు క్లాస్‌మేట్‌ అని, ఆక్రమంలో ముందునుంచీ తమకు కొంత సంబంధాలు ఉన్నాయని చెప్పారు. ఆదిలాబాద్‌ మీటింగ్‌కు వెళ్లి వస్తూ ఆరోగ్య సమాచారం దృష్ట్యా తనను పరామర్శించడానికి మాత్రమే ఆయన వచ్చారని వివరించారు. ఇందులో ఎలాంటి రాజకీయం లేదని, పార్టీల చర్చే తమ మధ్య రాలేదన్నారు. తొలిసారి తన ఇంటికి వచ్చినందున శాలువా, జ్ఞాపికతో సత్కరించానని అన్నారు.

మరిన్ని వార్తలు