అఫ్గాన్‌ నుంచి తెలంగాణవారిని క్షేమంగా తీసుకురండి

19 Aug, 2021 19:50 IST|Sakshi

ప్రధాని మోదీకి ఎంపీ కోమటిరెడ్డి లేఖ

అఫ్గాన్‌లో చిక్కుకున్న వారి కోసం టోల్‌ ఫ్రీ ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి

సాక్షి, హైదరాబాద్‌: అఫ్గానిస్తాన్‌లోని తెలంగాణ‌వాసుల‌ను సుర‌క్షితంగా తీసుకురావాలని ప్రధానమంత్రి నరేంద్రమోదీకి భువ‌న‌గిరి ఎంపీ కోమ‌టిరెడ్డి వెంక‌ట్ రెడ్డి విజ్ఞప్తి చేశారు. ఈ విషయమై గురువారం కోమటిరెడ్డి ప్రధానికి లేఖ రాశారు. అఫ్గాన్‌లో అక్క‌డ మ‌న వారు బిక్కుబిక్కుమంటూ కాలం వెళ్ల‌దీస్తున్నారని లేఖలో మోదీకి తెలిపారు. ప్రత్యేక విమానాలు ఏర్పాటు చేసి తీసుకురావాలని డిమాండ్‌ చేశారు. ముందుగా అఫ్గాన్‌లోని తెలంగాణ పౌరుల వివ‌రాలు సేక‌రించాలని సూచించారు. ఇక్క‌డ వారి కుటుంబాలు ఆందోళ‌న‌లో ఉన్నాయని తెలిపారు.

ఈ సంద‌ర్భంగా కోమ‌టిరెడ్డి వెంక‌ట్ రెడ్డి మాట్లాడుతూ.. ఉపాధి‌, స‌ర్కార్ చేయూత లేక‌పోవ‌డంతో తెలంగాణ‌ నుంచి ల‌క్ష‌లాది మంది ప్ర‌జ‌లు ఇత‌ర దేశాల‌కు వ‌ల‌స వెళ్లి జీవిస్తున్నారని తెలిపారు. ఆక్రమంలోనే అఫ్గానిస్తాన్‌కు కూడా ఉపాధి కోసం వెళ్లి ఇప్పుడు అక్క‌డ తెలంగాణ ప్ర‌జ‌లు చిక్కుకున్నారని చెప్పారు. ప్రస్తుతం బిక్కుబిక్కుమంటూ కాలం వెళ్ల‌దీస్తున్నారని ఆవేద‌న వ్య‌క్తం చేశారు. ప్రభుత్వం సహాయం చేస్తే వెంట‌నే తిరిగి వ‌చ్చేందుకు సిద్దంగా ఉన్నారని చెప్పారు. ప్ర‌త్యేక విమానాల్లో ప్ర‌జ‌ల‌ను సుర‌క్షితంగా వెన‌క్కి తీసుకువ‌చ్చేందుకు కేంద్రం చ‌ర్య‌లు తీసుకోవాలని డిమాండ్ చేశారు. విదేశాంగ శాఖ అఫ్గానిస్తాన్‌లో ఉన్న మ‌న దేశ ప్ర‌జ‌ల వివ‌రాలు సేక‌రించి సుర‌క్షితంగా వారిని ఇక్క‌డికి తీసుకువ‌చ్చే ప్ర‌యత్నం చేయాల‌ని సూచించారు. టోల్ ఫ్రీ నంబ‌ర్ ఏర్పాటు చేసి అఫ్గాన్‌లో ఉన్న మ‌న ప్ర‌జ‌ల‌ స‌మాచారం ఎప్ప‌టిక‌ప్పుడు తెలపాలని కోరారు.

మరిన్ని వార్తలు