వైఎస్సార్‌ లాంటి నేతలు లేరు: ఎంపీ కోమటిరెడ్డి

11 Jul, 2021 14:09 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ: చారిత్రక వైభవం కలిగిన భువనగిరి కోట అభివృద్ధికి సహకరించాలని కేంద్రానికి భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి విజ్ఞప్తి చేశారు. ఆయన ఆదివారం ఇందుకు సంబంధించిన లేఖను న్యూఢిల్లీ విజ్ఞాన్ భవన్‌లోని కేంద్ర పర్యాటక శాఖ మంత్రి జి. కిషన్‌రెడ్డికి అందజేశారు. అదేవిధంగా తెలంగాణ రాష్ట్రం నుంచి కేంద్ర పర్యాటక శాఖ మంత్రిగా నియమితులైన కిషన్‌రెడ్డికి ఆయన అభినందనలు తెలిపారు. నూతనంగా చేపట్టిన పర్యాటక రంగంలో కొత్త విధానాలు తీసుకువచ్చి యావత్ దేశానికి ఆదర్శంగా నిలవాలని కోరారు. అలాగే భువనగిరి పార్లమెంట్ పరిధిలో ఉన్న చారిత్రక ప్రదేశం భువనగిరి కోట అభివృద్ధికి సాయం చేయాలని కేంద్రమంత్రికి కోమటిరెడ్డి విజ్ఞప్తి చేశారు.

తెలంగాణ వ్యక్తిగా కిషన్‌రెడ్డికి భువనగిరి కోట విశిష్టత తెలుసని, ప్రత్యేక తెలంగాణలో రాష్ట్ర సర్కార్ కోట అభివృద్ధికి సహకరించడం లేదని తెలిపారు. నేటికి దేశంలో ఎన్నో చారిత్రక కట్టడాలు కాలగమనంలో కలిసిపోయాయని అన్నారు. ఇప్పటికైనా పట్టించుకోకుంటే భువనగిరి కోట కూడా అలాగే అవుతుందని తెలిపారు. కోట అభివృద్ధికి నిధులు మంజూరు చేయాలని ఎంపీ కిషన్‌రెడ్డిని కోరారు. ఇందుకు సానుకూలంగా స్పందించి నిధులను వెంటనే మంజూరు చేస్తామని కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి చెప్పారని ఆయన మీడియాకు తెలిపారు.

ఆయన తన ప్రసంగాన్ని కొనసాగిస్తూ... ‘‘ పీసీసీ నా దృష్టిలో చాలా చిన్న పదవి. రేవంత్‌రెడ్డి గురించి నా దగ్గర మాట్లాడవద్దు. మల్కాజ్‌గిరిలో 40 డివిజన్లలో పార్టీ డిపాజిట్ కోల్పోయింది. తెలంగాణ కాంగ్రెస్‌లో నియోజకవర్గ స్థాయి నేతలు తప్ప.. వైఎస్సార్‌ లాంటి నేతలు లేరు. కాంగ్రెస్‌లోనే ఉంటా.. పార్టీ మారే ఆలోచన లేదు. తెలంగాణలో కాంగ్రెస్‌ను ముందుకు నడిపై సమర్ధవంతమైన నాయకుడు లేడు. నేతలు రాజకీయాలు వదిలేసి అభివృద్ధిపై దృష్టి సారించాలి. ప్రజా సమస్యలపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలతో పోరాడుతా’’నని కోమటిరెడ్డి అన్నారు.

మరిన్ని వార్తలు