పని చేసింది మేమైతే.. ప్రశంసలు ప్రకాశ్‌రాజ్‌కా?

22 Sep, 2022 10:34 IST|Sakshi

కేశంపేట: సినీనటుడు ప్రకాశ్‌రాజ్‌ తన దత్తత గ్రామమైన రంగారెడ్డి జిల్లా కేశంపేట పరిధిలోని కొండారెడ్డిపల్లిని బాగా అభివృద్ధి చేశారని మంత్రి కేటీఆర్‌ ట్విట్టర్‌ వేదికగా ప్రశంసించడంపై ఆ గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేశారు. గ్రామస్తులతో కలసి సర్పంచ్‌ పల్లె స్వాతి బుధవారం విలేకరులతో మాట్లాడుతూ.. గ్రామాభివృద్ధిపై కేటీఆర్‌ పూర్తి సమాచారం తెలుసుకొని మాట్లాడితే బాగుండేదని అభిప్రాయపడ్డారు. 

ప్రకాశ్‌రాజ్‌ 2019 వరకే తమ గ్రామాన్ని దత్తత తీసుకున్నారని, ఆయన చేసిన అభివృద్ధి కంటే తాము సొంత నిధులతో చేసిన అభివృద్ధి ఎక్కువగా ఉందని ఆమె స్పష్టం చేశారు. మూడేళ్లుగా సొంత నిధులతో అభివృద్ధి చేస్తున్న తమను అభినందించాల్సి పోయి.. ప్రకాశ్‌రాజ్‌ అభివృద్ధి చేశారని చెప్పడం ఎంతవరకు సమంజసమని సర్పంచ్‌ స్వాతి ప్రశ్నించారు.  పనిచేసింది మేమైతే.. ప్రశంసలు ప్రకాశ్‌రాజ్‌కా? అంటూ కేటీఆర్‌కు ప్రశ్న సంధించారు ఆ ఊరి ప్రజలు.

మరిన్ని వార్తలు