‘కూ యాప్‌’కు తెలుగువారి ఆదరణ

25 Jan, 2021 22:08 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : ట్విట్టర్‌ తరహాలో అందుబాటులోకి వచ్చిన మైక్రో బ్లాగింగ్‌ ప్లాట్‌ ఫామ్‌ ‘కూ యాప్‌’కి తెలుగు వారి నుంచి అద్భుతమైన ఆదరణ లభిస్తోందని సంస్థ సీఈఓ అప్రమేయ రాధాకృష్ణ తెలిపారు. తమ యాప్‌ విశేషాలను పంచుకునేందుకు ఆన్‌లైన్‌ పత్రికా సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. గత 2020లో ప్రారంభమైన తమ యాప్‌ ప్రధానమంత్రి ఆధ్వర్యంలో నిర్వహించిన ఆత్మనిర్భర్‌ యాప్‌ ఇన్నోవేషన్‌ ఛాలెంజ్‌లో విజేతగా నిలిచిందన్నారు.

 ప్రస్తుతం హిందీ, తెలుగు, కన్నడ, తమిళ, గుజరాతీ, బెంగాలీ, మరాఠీ భాషలలో అందుబాటులో ఉందన్నారు. కేవలం కొన్ని నెలల్లోనే ప్రపంచపు అతిపెద్ద తెలుగు మైక్రో బ్లాగ్‌గా అవతరించిందని తెలిపారు. రాష్ట్రాల ముఖ్యమంత్రులు, సినీ ప్రముఖులు మరెందరో తమ యాప్‌ని వినియోగిస్తున్నారని వివరించారు. ఈ సమావేశంలో ప్రొడక్ట్‌ మేనేజర్‌ సాయి రామ తదితరులు పాల్గొన్నారు.
 

మరిన్ని వార్తలు