‘కూ’త పెట్టారా?

20 Mar, 2022 04:27 IST|Sakshi

దూసుకుపోతున్న తొలి దేశీ మైక్రో బ్లాగింగ్‌ ప్లాట్‌ఫామ్‌ 

2.5 కోట్ల మంది యూజర్లు.. 5 వేల మంది ప్రముఖులు 

10 మాతృభాషల్లో సందేశాలు పంపుకునే సౌకర్యం 

సాక్షితో ‘కూ’ సీఈవో అప్రమేయ రాధాకృష్ణన్‌  

మెసేజ్‌లు టైప్‌ చేయడం విసుగనిపిస్తోందా.. వేరే రాష్ట్రాల్లోని స్నేహితులకు వాళ్ల భాషలోనే సందేశాలు పంపాలనుకుంటున్నారా.. బంధువులతో లైవ్‌ వీడియోలు పంచుకోవాలనుకుంటున్నారా.. అయితే మీరు కూత పెట్టాల్సిందేనంటున్నారు ‘కూ’ సీఈవో అప్రమేయ రాధాకృష్ణన్‌. తొలి దేశీ మైక్రో బ్లాగింగ్‌ ప్లాట్‌ఫామ్‌ ‘కూ’ విశేషాలు, ప్రయాణం, భవిష్యత్‌ గురించి ఆయన ‘సాక్షి’తో మాట్లాడారు. ఆయన ఏమన్నారంటే.. 

అలా మొదలైంది: నేను, మయాంక్‌ బిడ్‌వటకా గతంలో ‘వోకల్‌’ పేరుతో ఓ అప్లికేషన్‌ను అభివృద్ధి చేశాం. అది కూడా స్థానిక భాషలే కేంద్రంగా పనిచేస్తుంది. ఏ అంశంపైన అయినా అడిగే ప్రశ్నలకు నిపుణుల నుంచి సమాధానాలు లభిస్తాయి. వోకల్‌ను అభివృద్ధి చేసే క్రమంలోనే స్థానిక భాషల్లో మైక్రో బ్లాగింగ్‌ అప్లికేషన్‌ అవసరాన్ని గుర్తించాం. 2019 నవంబర్‌లో మొదలుపెట్టగా 2020 మార్చికల్లా ‘కూ’ సిద్ధమైంది. మైసూరు సమీపంలోని మండ్యలో కన్నడ భాషతో ‘కూ’ మొదలైంది.  

22 భాషల్లో తెచ్చేందుకు ప్రయత్నాలు 
గతేడాది డిసెంబర్‌ నాటికే దేశంలో ‘కూ’ వాడే వారి సంఖ్య 2 కోట్లు దాటింది. ప్రస్తుతం 2.5 కోట్ల వరకూ ఉంది. 5 వేల మంది సెలబ్రిటీలూ వాడుతున్నారు. ఇంగ్లిష్, తెలుగు, కన్నడ, తమిళం, హిందీ, పంజాబీ, గుజరాతీ, బెంగాలి, మరాఠీ, అసమీస్‌ వంటి 10 భాషల్లో అందుబాటులో ఉంది. కేంద్రం గుర్తించిన 22 భారతీయ భాషల్లోనూ అందుబాటులోకి తెచ్చేందుకు ప్రయత్నిస్తున్నాం.  

ఏంటీ ‘కూ’ ప్రత్యేకతలు?: భారతీయ భాషల్లోనే సందేశాలు ఇచ్చిపుచ్చుకోవడంతో పాటు ‘వాయిస్‌ టు టైప్‌’ కూడా ఉంటుంది. మీ మాతృ భాషలో మాట్లాడితే ఆ మాటలు అక్షరాల్లా టైప్‌ అవుతాయి. ఒక భాషలోని సందేశాన్ని మిగిలిన 9 భాషల్లోకీ తర్జుమా చేయవచ్చు. బంధు మిత్రులతో లైవ్‌ వీడియో చేయడం, చాట్‌రూమ్‌ ఏర్పాటు చేసుకోవడం మిగిలిన ప్రత్యేకతలు. 

మరిన్ని వార్తలు