దళితుల కోసం ప్రత్యేక వర్సిటీ

24 Mar, 2021 03:01 IST|Sakshi

ఏర్పాటు చేసే ఆలోచనలో సీఎం కేసీఆర్‌ 

పద్దులపై చర్చలో ఎస్సీ అభివృద్ధి మంత్రి కొప్పుల 

సాక్షి, హైదరాబాద్‌: దళితుల కోసం ప్రత్యేకంగా యూనివర్సిటీని ఏర్పాటు చేసే ఆలోచన ముఖ్యమంత్రికి ఉందని, త్వరలో అది ఏర్పాటయ్యే అవకాశముందని ఎస్సీ అభివృద్ధి, సాంఘిక, సంక్షేమశాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్‌ వెల్లడించారు. ఇప్పటికే కొందరు ఎమ్మెల్యేలు కూడా దీన్ని ఏర్పాటు చేయాలని సీఎంను కోరారని సభ దృష్టికి తెచ్చారు. పద్దులపై చర్చలో భాగంగా ఎస్సీ, బీసీ, మైనారిటీ సంక్షేమ విషయాలపై పలువురు సభ్యుల సందేహాలను నివృత్తి చేస్తూ కొప్పుల వివరాలు వెల్లడించారు.

గురుకుల పాఠశాలల్లో ఉండేందుకు గతంలో ఇష్టపడేవారు కాదని, కానీ ప్రస్తుతం వాటిలో సీట్ల కోసం పెద్దపోటీ నెలకొందన్నారు. కల్యాణలక్ష్మి, ఉపాధి రుణాలతో ఆయా కుటుం బాలకు ఆసరాగా ఉంటుండగా, వారి పిల్లలకు నాణ్యమైన విద్యనందించి ప్రపంచంలో ఎక్కడైనా పోటీని తట్టుకునేలా నిలిచేందుకు దోహదం చేస్తున్నట్లు పేర్కొన్నారు. విదేశాల్లో నాణ్యమైన, ఉన్నత విద్యను పొందేందుకు కావాల్సిన ఆర్థిక సాయాన్ని ప్రభుత్వం అందిస్తోందన్నారు.  

మరిన్ని వార్తలు