జర్నలిస్టు కుటుంబాలకు లక్ష రూపాయాల ఆర్థిక సాయం

8 Mar, 2021 09:07 IST|Sakshi
ఆర్థిక సాయం అందజేస్తున్న కేటీఆర్‌

ఖమ్మం సహకారనగర్‌: చనిపోయిన, అచేతనావస్థకు గురైన జర్నలిస్టుల కుటుంబాలకు తెలంగాణ మీడియా అకాడమీ ఆధ్వర్యంలో  ఆర్థికసాయం అందించారు. హైదరాబాద్‌ జలవిహార్‌లో ఆదివారం జరిగిన ఈ కార్యక్రమానికి ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్‌ ముఖ్య అతిథిగా హాజరై చెక్కులు పంపిణీ చేశారు. ఉమ్మడి జిల్లాకు చెందిన 8 మంది జర్నలిస్టుల కుటుంబాలకు ఒక్కొక్కరికి రూ. లక్ష చొప్పున మొత్తం రూ.8 లక్షల చెక్కులను అందించారు. ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్‌ మాట్లాడుతూ చనిపోయిన జర్నలిస్టుల కుటుంబాలలో పదోతరగతిలోపు చదివే పిల్లలకు ప్రభుత్వ రెసిడెన్షియల్‌ పాఠశాలల్లో చదువు చెప్పిస్తామని హామీ ఇచ్చారు.

జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు ఇచ్చే బాధ్యత తనదని, రాబోయే మూడేళ్లలో అందరికీ స్థలాలు ఇచ్చి తీరుతామని అన్నారు. అకాడమీ చైర్మన్‌ అల్లం నారాయణ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమం జరిగింది. టీయూడబ్ల్యూజే ఖమ్మం జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు ఆకుతోట ఆదినారాయణ, సయ్యద్‌ ఇస్మాయిల్, టెంజూ అధ్యక్షుడు అడపాల నాగేందర్, భద్రాద్రి  జిల్లా అధ్యక్షుడు కల్లోజి శ్రీనివాస్,  చండ్ర నరసింహారావు, వట్టికొండ రవి పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు