సద్గురు ‘సేవ్‌ సాయిల్‌’ అద్భుతం: కేటీఆర్‌ 

25 May, 2022 01:54 IST|Sakshi
మంత్రి కేటీఆర్‌కు జ్ఞాపికను అందిస్తున్న  సద్గురు జగ్గీ వాసుదేవ్‌

దావోస్‌లో సద్గురు, మంత్రి కేటీఆర్‌ చర్చ

సాక్షి, హైదరాబాద్‌: సద్గురు జగ్గీ వాసుదేవ్‌ చేపట్టిన ‘సేవ్‌ సాయిల్‌’ కార్యక్రమం ప్రశంసనీయమని రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి కె.తారకరామారావు అన్నారు. తెలంగాణలో సారవంతమైన భూములను కాపాడుకోవడంతోపాటు పర్యావరణ అనుకూల కార్యక్రమాలు చేపడుతున్నామని తెలిపారు. ప్రపంచవ్యాప్తంగా ‘సేవ్‌ సాయిల్‌’ పేరుతో సద్గురు అవగాహన కార్యక్రమాలను కొనసాగిస్తున్నారు. ఇందులో భాగంగా రెండు రోజులపాటు దావోస్‌లో ప్రపంచస్థాయి కంపెనీల ప్రతినిధులను కలిశారు. తన కార్యక్రమంలో కలిసి రావాలని విజ్ఞప్తి చేశారు. మంగళవారం కేటీఆర్‌తో కలిసి దావోస్‌లోని తెలంగాణ పెవిలియన్‌లో సద్గురు చర్చా కార్యక్రమం నిర్వహించారు.

ప్రపంచవ్యాప్తంగా భూమి సారాన్ని కోల్పోతోందని, త్వరలోనే ఈ సమస్య వల్ల ఆహారకొరత ఏర్పడే ప్రమాదముందని సద్గురు అభిప్రాయపడ్డారు. భవిష్యత్‌లో వ్యవసాయ యోగ్యమైన నేలలు అంతరించిపోయే ప్రమాదం ఉన్నందున ఇప్పటి నుంచే భూమిని పంటలకు అనుగుణంగా సారవంతం చేసే కార్యక్రమాలను చేపట్టాలని అభిప్రాయపడ్డారు. ఈ సందర్భంగా ప్రపంచంలోనే రెండో అతిపెద్ద మానవ ప్రయత్నం అయిన హరితహారం కార్యక్రమం గురించి కేటీఆర్‌ వివరించారు. తెలంగాణ వ్యవసాయ రంగంలో తీసుకువచ్చిన కార్యక్రమాలను ప్రశంసించిన సద్గురు తమసంస్థ ద్వారా వ్యవసాయ రంగంలో రైతుల ఆదాయం పెంపునకు చేపట్టిన కార్యక్రమాలపై తెలంగాణ ప్రభుత్వంతో కలసి పనిచేసేందుకు సిద్ధంగా ఉన్నామని తెలిపారు.   

మరిన్ని వార్తలు