ఉచిత అంబులెన్సులను ప్రారంభించిన కేటీఆర్‌

27 Aug, 2020 01:58 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: ‘గిఫ్ట్‌ ఏ స్మైల్‌’ నినాదంలో భాగంగా విరాళంగా అందిన పది అంబులెన్సులను రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీ రామారావు బుధవారం ప్రారంభించారు. వీటిని ఉమ్మడి వరంగల్‌ జిల్లాలో సేవల నిమిత్తం వినియోగించనున్నట్టు మంత్రి తెలిపారు. పాలకుర్తి, వర్ధన్నపేట నియోజకవర్గాలకు రెండు.. ములుగు, భూపాలపల్లి, పరకాల, వరంగల్‌ పశ్చిమ, వరంగల్‌ తూర్పు, జనగామ నియోజకవర్గాలకు ఒక్కో అంబులెన్సు చొప్పున అందజేస్తున్నట్లు వెల్లడించారు. అంబులెన్సులను సకాలంలో తయారు చేయించిన పంచాయతీరాజ్‌ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావుతో పాటు విరాళాలు ఇచ్చిన దాతలను కేటీఆర్‌ అభినందించారు. ఈ కార్యక్రమంలో మంత్రి ఈటల రాజేందర్, ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి, ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్‌రెడ్డి, టీఆర్‌ఎస్‌ నేత వాసుదేవరెడ్డి తదితరులు పాల్గొన్నారు. 

మరిన్ని వార్తలు